ఎన్డీయే లోకి జగన్ కు ఆహ్వానం .. మంత్రి పదవులు కూడా ఇస్తారట .. జగన్ నిర్ణయమేంటో ?
Recommended Video
దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 353 స్థానాలలో విజయ కేతనం ఎగురవేసి మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది .రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వస్తే ఎవరికి వారు మేమే కీలకం అవుతామని భావించారు. కానీ అలా జరగలేదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేదనిఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు . ఎన్డీఏ మెజారిటీ 250 స్థానాలకు దగ్గరగా వచ్చి ఆగిపోయి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే.. తాము మద్దతు ఇస్తామని షరతు విధించి ఉండేవాడినని, ఇప్పుడు ఆ అవకాశం చేజారినట్టే కనిపిస్తోందని చెప్పారు. అయినా ఎన్డీయే నుండి జగన్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
చంద్రబాబు చూస్తున్నారా : ప్రధాని ఖుషీ..శభాష్.,జగన్ భుజం తట్టి ఆలింగనం: నేనున్నానంటూ భరోసా..
ఎన్డీయేలోకి జగన్ ను ఆహ్వానించిన అమిత్ షా .. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైసీపీ అధినేత జగన్ కేంద్రంలో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న మోడీ ని, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ని కలిశారు. ఈ నేపధ్యంలో ఎన్డీయేలోకి ఆహ్వానించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దేశంలో ప్రధాని మోదీ తర్వాత జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసిన వైసీపీ అధ్యక్షుడు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమిత్ షా తో భేటీ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని ఎన్డీయేలోకి రావాల్సిందిగా అమిత్ షా ఆహ్వానించారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా జగన్ కోరారు. దీనిపై మరోమారు చర్చిద్దామని అమిత్ షా చెప్పినట్టు తెలిసింది.
ఎన్డీయేలో చేరితే కేంద్రంలో వైసీపీ ఎంపీలకు 2 మంత్రి పదవులు ఆఫర్ చేసిన అమిత్ షా
ఇక ఎన్డీయే లోకి జగన్ ను ఆహ్వానించిన అమిత్ షా ఒకవేళ వైసీపీ ఎన్డీయేలో చేరితే.. ఆ పార్టీకి రెండు మంత్రిపదవులు కూడా ఇస్తామని ప్రతిపాదించారని సమాచారం . పౌర విమానయాన శాఖతో పాటు మరో సహాయమంత్రి పదవిని కూడా ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం.2014లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి కూడా కేంద్రంలో పౌర విమానయాన శాఖతో పాటు మరో కేంద్ర సహాయమంత్రి పదవిని బీజేపీ ఇచ్చింది. అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఇద్దరూ కేంద్రంలో మంత్రిపదవులు పొందారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పుడు ఆ రెండు మంత్రిపదవులకు రాజీనామా చేశారు.
ప్రత్యేక హోదాకు ఓకే అంటేనే ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం
అయితే, అమిత్ షా ఆఫర్ చేసిన మంత్రి పదవుల విషయంలో పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని జగన్ మోహన్ రెడ్డి అమిత్ షాకు చెప్పినట్టు తెలిసింది.కానీ జగన్ మోహన్ రెడ్డి ఎన్డీయే లోకి వెళ్ళాలంటే ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపైనే పట్టు పట్టే అవకాశం కనిపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఎపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని ఏపీ ప్రజలకు మాటిచ్చిన నేపధ్యంలో కేంద్రంతో ఈ దిశగా చర్చలు జరిపే అవకాశం వుంది. ఏ మాత్రం ప్రత్యేక హోదాకు ఓకే చెప్పినా జగన్ ఎన్డీయే కూటమిలో చేరే ఛాన్స్ వుంది . ఇటీవల వచ్చిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక కేంద్రంలో ఎన్డీయేకు పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. ఎన్డీయేకు 353 మంది సభ్యుల బలంతో స్పష్టమైన మెజార్టీ ఉంది . ఒకవేళ వైసీపీ కూడా ఎన్డీయేలో చేరితే ఆ సంఖ్యాబలం 375కు చేరుతుంది. అప్పుడు లోక్సభలో ఎన్డీయే బలం మూడింట రెండు వంతులకు పెరుగుతుంది.