రంగంలో ఎన్డీఆర్ఎఫ్: జోరువానలోనూ సహాయక చర్యలు ముమ్మరం
Recommended Video
భువనేశ్వర్/శ్రీకాకుళం: ఫొని తుఫాన్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను చేపట్టాయి. జోరువాన-హోరుగాలిలోనూ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెనక్కి తగ్గలేదు. ఈదురుగాలుల ధాటికి నేల కూలిన చెట్లను తొలగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టారు. సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి కొత్తూరు, కవిటి, కంచిలి, సోంపేటలల్లో ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారికి సహకరిస్తున్నారు.
ఒడిశాలోని కటక్ లో వర్షం కాస్త తెరిపినివ్వడంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రంపం, గొడ్డళ్లతో చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. బుల్డోజర్ల సహాయంతో చెట్లను తొలగిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఆటంకం వాటిల్లకూడదనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తుఫాను తీరానికి సమీపిస్తున్న కొద్దీ శ్రీకాకుళం జిల్లాలో ప్రచండవేగంతో గాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గాఢాంధకారం నెలకొంది. కంటి మీద కునుకు లేకుండా గడిపారు ఆయా గ్రామాల ప్రజలు. సముద్రానికి సమీపంలో ఉన్న కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, మందస, సంత బొమ్మాళి, ఎచ్చెర్ల, గార, పోలాకి, శ్రీకాకుళం తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ సిబ్బంది కూడా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నం అయ్యారు. నేలకు ఒరిగిన విద్యుత్ స్తంభాలను సరి చేస్తున్నారు. తెగి పడ్డ తీగలను తొలగించి, కొత్త వాటిని వెనువెంటనే అమర్చుతున్నారు. దీనికోసం పదుల సంఖ్యలో ఎస్పీడీసీఎల్ బ్రేక్ డౌన్ సిబ్బంది పని చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా గురువారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- విద్యుత్ సంబంధిత ప్రమాదాలు గానీ, మరణాలు గానీ చోటు చేసుకోలేదని తెలుస్తోంది.