జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు నేదురుమల్లి రామ్
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్రెడ్డి తనయుడు రామ్కుమార్ ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
పార్టీలోకి ఆహ్వానించిన జగన్
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ జగన్ శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ కండువా కప్పి రామ్కుమార్ను, రామ్ కుమార్, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.
జగన్తోనే సాధ్యం
ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు రాజకీయ నాయకులపై ఉండాల్సింది అభిమానం, నమ్మకమని ఇవి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారని అన్నారు. మళ్లీ ప్రజలకు రాజకీయ నాయకులపై నమ్మకం రావాలంటే అది జననేత వైఎస్ జగన్తోనే సాధ్యమన్నారు.
ఈసారి వైయస్ జగన్వైపే ప్రజలు
గత ఎన్నికల్లో ఉన్న రెండు ఆప్షన్స్లో ప్రజలు అనుభవం వైపు మొగ్గు చూపారని రామ్ కుమార్ అన్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్ల సీఎం చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, ఈ సారి వైయస్ జగన్కు అవకాశమివ్వాలని యోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీంతోనే నేదురుమల్లి వర్గంతో మాట్లాడి పార్టీలో చేరడం జరిగిందన్నారు.
అందుకే ఎదురు చూశా..
జనార్థన్ రెడ్డి, వైయస్సార్లు చాలా సన్నిహితంగా ఉండేవారని, వారి చాలా దగ్గరి నుంచి చూశానని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు రామ్ కుమార్. జనార్థన్ రెడ్డి తన చివరి ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేశారని, లక్ష 75 వేల ఓట్లతో గెలుపొందారని తెలిపారు. నెల రోజుల క్రితమే పార్టీలో చేరాలనుకున్నా.. పాదయాత్ర విశాఖ చేరేవరకు ఎదురుచూశానని నేదురుమల్లి రామ్ కుమార్ వివరించారు.