బీజేపీకి నేదురుమల్లి కొడుకు షాక్, జగన్తో భేటీ: వెంకటగిరిపై ఆశలు, అప్పటికే ఆనంకు హామీ!
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కలిశారు. ఆయన వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ టిక్కెట్ పైన ఆశతో ఉన్నారు. అయితే, ఇప్పటికే వెంకటగిరి స్థానంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా, భారతీయ జనతా పార్టీ ఇటీవలే రాంకుమార్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించడం గమనార్హం.
నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగస్టులో వైసీపీలో చేరుతారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. నేదురుమల్లి అభిమానుల అభిప్రాయాలు తెలుసుకొని 2019 ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయం ఆగస్టులో ప్రకటిస్తానని రామ్ కుమార్ రెడ్డి మూడు నెలల క్రితం చెప్పారు.
తాను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని అభిమానులు, కార్యకర్తలతో భేటీ సందర్భంగా కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా అంత క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు మరో అడుగు వేశారు. ఆయన బీజేపీకి షాకిచ్చి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.