అమరావతిలో 'స్టార్టప్' అభివృద్ధి, 20 ఏళ్ల సమయం: లక్షల ఉద్యోగాలు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి తొలి ఫేజ్ నిర్మాణానికి పదిహేనేళ్లు పట్టనుందని చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కోసం సీఆర్డీఏ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది.
సీడ్ కేపిటల్లో స్టార్టప్ కోసం 6.84 చ.కి.మీ. ప్రాంతం కేటాయిస్తున్నారు. ఇది రాజధాని నగరానికే పైలట్ ప్రాజెక్టు వంటిది. దానిని దృష్టిలో పెట్టుకొనే సింగపూర్ కన్సార్టియం స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదనను అందజేసిందని సీఆర్డీఏ చెబుతోంది. స్టార్టప్ భాగం ఎక్కువగా కృష్ణా నది ఒడ్డునే ఉంటుంది.
ఈ కారణంగానే నదీ తీరాన్ని అనుకొని ఉన్న 1691 ఎకరాలను స్టార్టప్ ప్రాంతంగా ఎంపిక చేశారు. ఇక్కడ నివసించే వారికి అన్ని సౌకర్యాలు అత్యుత్తమంగా ఉంటాయి. ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేందే నాటికి లక్షకు పైగా కుటుంబాలు నివసిస్తాయని, రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. నదికి అభిముఖంగా ఉంటుంది. నదీ తీరం, ఆహ్లాద వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థలానికి ఎక్కువ డిమాండ్ తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి దీని అభివృద్ధికి 20 ఏళ్ల సమయం పెట్టుకున్నారు. మొదటి దశలో అబివృద్ధి చేసిన స్థలాల్లో డెబ్బై శాతం అమ్ముడు అయితే రెండో దశ ప్రాజెక్టు పైన దృష్టి సారించనున్నారు.