ఏపీ కేపిటల్ ఇష్యూ : అసలేంటీ బోస్టన్ కంపెనీ.. ఆ నివేదికలో ఏముంది..?
రాజధాని అంశంపై హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బోస్టన్ కంపెనీ ఎక్కడిది..? రాజధానిపై ఆ కంపెనీ ఎలాంటి అధ్యయనం చేపట్టింది..? నివేదికలో ఏం చెప్పబోతోంది..? వంటి ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి ? చెన్నైలో ఉంటే ఏంటి ? అంటున్న ఆర్జీవీ
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ :
బోస్టన్ గ్రూప్ అమెరికాకు చెందిన సంస్థ. 1963లో స్థాపించబడిన ఈ సంస్థ.. తర్వాతి కాలంలో దాదాపు 50 దేశాలకు విస్తరించింది. ఆయా దేశాల్లో సుమారు 90 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. రిచ్ లెసర్ ప్రస్తుతం ఈ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయా దేశాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాజెక్టులను రూపొందించడం బోస్టన్ గ్రూప్ చేసే పని.
ఇప్పటివరకు చేసిన పనులు :
ముంబై,న్యూ గోవా,పారాదీప్, వైజాగ్, ఎన్నూర్, చెన్నై,చిదంబరం పోర్టు ట్రస్ట్, కాండ్ల,కోల్కతా,న్యూ మంగళూరు,కొచ్చిన్ పోర్టుల అభివృద్దకి బోస్టన్ గ్రూప్ సలహాలు సూచనలు ఇచ్చింది. అయితే రహదారులు,పోర్టులు ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనపై మాత్రమే ఇంతవరకు బోస్టన్ గ్రూప్ సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పాలనాపరమైన అంశాలకు మాత్రం దూరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి కీలకమైన రాజధానిపై అంశంపై బోస్టన్ గ్రూప్ పనిచేస్తోంది. నిజానికి రాష్ట్ర రాజధానిపై అధ్యయనం అంటే ప్రభుత్వం నుండి అధికారిక జీవో రావాలి. కానీ బోస్టన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం గమనార్హ:.
ఆ నివేదికలో ఏముంది..
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇదివరకే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి రీత్యా గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ కంటే బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్ ఉత్తమం అని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే బోస్టన్ తుది నివేదిక వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
గ్రీన్ ఫీల్డ్ కేపిటల్.. బ్రౌన్ ఫీల్డ్.. తేడా అదే..
అప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్గా చెబుతారు. తద్వారా ఆ ప్రాంతంలో అప్పటికే ఏర్పడిన మౌలిక సదుపాయాలను రాజధాని కోసం వినియోగించుకుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం 'బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్' వంటిదే. ఇక గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ విషయానికొస్తే.. చంఢీఘడ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. చంఢీఘడ్ తర్వాత మళ్లీ ఆ పద్దతిలో నిర్మించాలనుకున్న కేపిటల్ అమరావతి. సాధ్యమైనంత తక్కువ భూసేకరణ,పర్యావరణ పరిరక్షణ,వ్యవసాయ భూములకు తక్కువ నష్టం కలిగే రీతిలో రాజధానిని నిర్మించడాన్ని గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ అంటారు. అయితే అమరావతి విషయంలో గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ నిబంధనలను పాటించారా? అన్న చర్చ కూడా ఉంది. భారీ స్థాయిలో భూసేకరణ, వ్యవసాయ భూములకు నష్టం,కృష్ణా
నది నుంచి పొంచి ఉన్న ముప్పు.. వంటి విషయాలను పరిగణిస్తే అమరావతిని గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ అనవచ్చా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.