నీట్ క్రెడిట్ చంద్రబాబుదే, మావల్లే ఆర్డినెన్స్ : మంత్రి కామినేని
గుంటూరు : నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వచ్చే ఏడాదికి వాయిదా పడడంలో క్రెడిట్ అంతా తమదేనని ప్రకటించుకుంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. తాజాగా నీట్ పై స్పందించిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తుల మేరకే కేంద్రం నీట్ పై ఆర్డినెన్స్ తెచ్చిందని తెలిపారు.
ఆర్డినెన్స్ కోసం మొదటగా పట్టుబట్టింది చంద్రబాబేనని, ఆయన ప్రయత్నాల ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. మెడికల్ ఎంట్రన్స్ ద్వారా సీట్లు పొందాలనుకుంటున్న అభ్యర్థులకు నీట్ అడ్డంకిగా మారుతుందనే ఉద్దేశంతోనే నీట్ ను ఈ ఏడాదికి వాయిదా వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, తమ వాదనతో ఏకీభవించిన కేంద్రం సానుకూలంగా స్పందించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందన్నారు.
ఇక ఎంసెట్ గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో మెడికల్ ఎంట్రన్స్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ దఫా ఫలితాలను సీఎం చంద్రబాబే స్వయంగా విడుదల చేస్తారని తెలియజేశారు. అలాగే, ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చాలా వరకు మెరుగైందని, ఎలుకల బెడదతో ఇబ్బందులు పడ్డ రోగులకు ఇప్పుడు అలాంటి ఇబ్బందేమి లేదన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకై.. త్వరలోనే పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు మంత్రి కామినేని.