తెలంగాణ రిజిస్ట్రేషన్ కారులో నీతూ అగర్వాల్, సంచలనాలు
కర్నూలు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలు, ప్రముఖ సినీ నటి నీతూ అగర్వాల్ గురువారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ న్యాయస్థానంలో హాజరయ్యారు. ప్రయివేటు వ్యక్తులు వెంట రాగా ఆమె తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన కారులో న్యాయస్థానానికి వచ్చారు. వచ్చే నెల 17వ తేదీన తదుపరి వాయిదాకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు, నీతూ అగర్వాల్ను విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలు కూపీలాగినట్లుగా తెలుస్తోంది. నీతూ మొబైల్ ఫోన్లో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఇద్దరు కర్నూలు, ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారని సమాచారం.
నీతూ అగర్వాల్ ఎర్ర చందనం స్మగ్లర్గా అవతారం ఎత్తిందని, వివిధ ప్రాంతాల్లోని ఎర్ర చందనాన్ని అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయించిందని, నగదు లావాదేవీలు నిర్వహించిందని, భర్త మస్తాన్ వలీ జైల్లో ఉన్నప్పుడు అతడి తరఫున నీతూ అగర్వాల్ స్మగ్లింగ్ కార్యకలాపాలన్నీ చక్కబెట్టిందని పోలీసుల విచారణలో ఈ మేరకు స్వయంగా నీతూ అగర్వాలే స్పష్టం చేసిందని తెలుస్తోంది.
నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపానని, వారిలో ఇద్దరు కర్నూలుకు చెందిన వారు కాగా ఇద్దరు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నీతూ అగర్వాల్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆమె సెల్ఫోన్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీకి మస్తాన్ వలీ రూ.70 లక్షల విరాళమిచ్చాడని కూడా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడానికి చిత్తూరు, కర్నూలు, బెంగళూరుల్లో మస్తాన్ వలీ డెన్లు నిర్వహిస్తున్నాడని పోలీసులకు చెప్పిందని సమాచారం.
కాగా, ఎర్ర చందనం కేసులో అరెస్టై బుధవారం నాడు జైలు నుండి విడుదలైన నీతూ అగర్వాల్ ఇంటర్వ్యూ కోసం డబ్పులు వసూలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఆ డబ్బులు ఆమె వసూలు చేయలేదని తెలుస్తోంది.
నీతూ అగర్వాల్ ఇంటర్వ్యూ కోసం ఆమె మేనేజర్ డబ్బులు వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె విడుదలయ్యాక ఇంటర్వ్యూ కోసం మీడియా ఎదురు చూడటం సహజమే. ఈ నేపథ్యంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇంటర్వ్యూ కోస ఇరవై వేల రూపాయలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.