ఆళ్లగడ్డ కోర్టుకు నీతు అగర్వాల్, కీలక సమాచారం రాబట్టారా?
కర్నూలు: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేసిన ప్రముఖ సినీ నటి నీతు అగర్వాల్ కస్టడీ ముగియడంతో పోలీసులు ఆమెను బుధవారం సాయంత్రం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నీతు పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో కోర్టుకు తీసుకు వచ్చారు. కాగా, ఆమె నుండి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారని వార్తలు వస్తున్నాయి.
ఎర్ర చందనం స్మగ్లింగ్తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ తెలుగు నటి నీతు అగర్వాల్ హైదరాబాదు నుండి బెంగళూరుకు పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. నీతుని ఆదివారం మీడియా ముందుకు ప్రవేశపెట్టారు.
ఆమె బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆధారాల తర్వాతే అరెస్టు చేసినట్లు చెప్పారు. నీతు అగర్వాల్ పోలీసులకు చిక్కగానే ఏడ్చింది. మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు కూడా వెక్కివెక్కి ఏడ్చింది.
కాగా, పోలీసుల విచారణలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా నాలుగు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. మస్తాన్ వలీ తనను శారీరకంగా హింసించాడని, తనను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరోపించారు.
అతడి వేధింపులు తట్టుకోలేక తాను అతడికి లొంగిపోయానని, ఈ క్రమంలోనే ఆ రొంపిలోకి దిగవలసి వచ్చిందని చెప్పారు. మస్తాన్ వలీతో సంబంధాలు ఏర్పడ్డాక ఆమె తన కుటుంబానికి దూరమయ్యారు. నీతు అరెస్టైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు కర్నూలు వచ్చారు. ఇదిలా ఉండగా, ఎర్ర చందనం కేసు నేపథ్యంలో నీతు అగర్వాల్ లొంగుబాటు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.