స్మగ్లింగ్పై తెలియదా?: నీతును మళ్లీ విచారించే ఛాన్స్
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీసుల కస్టడీలో సినీ నటి నీతూ అగర్వాల్ కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి మాత్రం తనకు తెలియదని చెప్పారని తెలుస్తోంది. కోర్టు అనుమతితో నీతూను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు.
అనంతరం గురువారం సాయంత్రం ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు నంద్యాల సబ్ జైలుకు తరలించారు. ఆళ్లగడ్డ ఏఎస్పీ పర్యవేక్షణలో మహిళా వీఆర్వో, న్యాయవాది ఆధ్వర్యంలో ఆమెను పోలీస్ స్టేషన్లో విచారించారు.
చాలా ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీల విషయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ను వినియోగించలేదని, ఏటీఎం కార్డు ద్వారా మాత్రమే నగదు తీసుకున్నానని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన వారెవరినీ తాను ప్రత్యక్షంగా చూడలేదని చెప్పారని తెలుస్తోంది. ఇంటర్నెట్ బ్యాంకు లావాదేవీలు మస్తాన్వలీ నిర్వహించి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. అరెస్టు సమయంలో ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన కొందరికి ఫోన్ చేసి విషయమై కూడా పోలీసులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కాగా, నీతూ నుంచి సమగ్ర సమాచారం రాకపోవడంతో మరోమారు విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.