నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది, బెదిరింపు ఫోన్స్: ఏడ్చిన నీతూ
కర్నూలు: అక్రమ ఎర్ర చందనం కేసులో అరెస్టై, జైలు నుండి విడుదలైన ప్రముఖ నటి నీతూ అగర్వాల్ మరోసారి మీడియా ముందు బోరుమన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె అన్నారు. ఎర్రచందనం కేసులో తనను అనవసరంగా ఇరికించారన్నారు. ఈ విషయంలో మస్తాన్ వలీ తనను మోసం చేశాడన్నారు. ఈ కేసు విషయంలో ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందన్నారు.
తాను ఏ తప్పు చేయలేదని మరోసారి చెప్పారు. ఈ కేసు నుండి తాను నిర్ధోషిగా బయటపడతానన్నారు. స్మగ్లర్లు తనను లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోందన్నారు.
కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో భాగంగా నీతూ అగర్వాల్ ఆదివారం నాడు ఉదయం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బోరుమన్నారు. తనకు ప్రాణ భయం ఉందని చెప్పారు.