షాక్: పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తానని రూ.4కోట్లు కాజేసిన సీఐ
నెల్లూరు/గుంటూరు: మోసం పోయేవాడుంటే ఎలాగైనా మోసం చేయవచ్చునని నెల్లూరు సీఐ శేషా రావు మరోసారి నిరూపించారు. ఏకంగా పద్మశ్రీ అవార్డులు, కేంద్రప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.4కోట్లు వసూలు చేశాడు. మొత్తం డబ్బు ఇచ్చేశాక మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు సీఐ శేషారావు స్థానికంగా రొయ్యల వ్యాపారం చేసే రమణయ్యనాయుడు అనే వ్యక్తి పరిచయం ఉంది. ఆ పరిచయం రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెంచింది. ఈ నేపథ్యంలో రమణయ్యనాయుడుకు పేరు ప్రఖ్యాతులంటే ఇష్టమని శేషారావు పసిగట్టాడు.
ఈ క్రమంలో తనకు కేంద్ర ప్రభుత్వలో పలుకుబడి ఉందని, పద్మశ్రీ అవార్డుతోపాటు కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తానని రమణయ్యనాయుడును శేషా రావు నమ్మించాడు. అతని మాటలను నమ్మిన రమణయ్యనాయుడు తరచుగా డబ్బును పెద్ద పెద్ద మొత్తంలోనే సమర్పించుకున్నాడు.
అవార్డులు వచ్చినట్లు దొంగపత్రాలు సృష్టించి.. ఆ తర్వాత రమణయ్యను రాష్ట్రపతి భవన్ చుట్టూ కూడా తిప్పించాడు. రమణయ్యతోపాటు మరో వ్యక్తి వద్ద ఇలానే చేశాడు శేషారావు. వీరి వద్ద మొత్తం రూ.4కోట్ల వరకు వసూలు చేయడం గమనార్హం. అంతా అయిపోయాక తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి ప్రధాన నిందితుడైన సీఐ శేషారావు, అతని కొడుకు, కోడలు, మామను అరెస్ట్ చేశారు. శేషారావు వద్ద నుంచి కాజేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.