చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా కీలక నేత
ఏపీలోని నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. చాలా ఆప్యాయంగా ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీద మస్తాన్ రావును పార్టీలో చేర్చుకోవటం ద్వారా నెల్లూరు రాజకీయాల్లో టీడీపీకి చెక్ పెట్టే వ్యూహం రచించారు వైసీపీ నేతలు.
టీడీపీకి షాక్ ... ఆ కీలక నేత జంప్ తో మారనున్న నెల్లూరు రాజకీయాలు
ఇక నేడుజగన్ సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం బీద మస్తాన్రావు మాట్లాడుతూ తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసే తానుపార్టీలో చేరుతున్నానని, ఇక సీఎం జగన్ అందిస్తున్న పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చారని, పలు పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగవద్గీత, బైబుల్, ఖురాన్గా భావిస్తోందని అన్నారు. అందుకే అన్ని ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు .
బీద మస్తాన్రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు . గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు. ఆర్ధికంగా కూడా పార్టీకి బాసటగా నిలిచారు. ఇక తన వ్యక్తిగత కారణాలతో పార్టీ వీడి వెళ్తున్నానని చెప్పిన బీద మస్తాన్రావు ఆ పార్టీకి ఫైనల్ గా గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరి బాబుకు నెల్లూరులో ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు .