గుడ్లు చాటున గుట్కా,గంజాయ్;3 కోట్ల విలువ చేసే సరుకు; గుట్టు రట్టు చేసిన నెల్లూరు పోలీసులు
నెల్లూరు జిల్లా: ఎపిలో గుట్కా దందా జోరుగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎపిలోకి గుట్కా సరుకు తెప్పిస్తున్న అక్రమ వ్యాపారులు ఆ తరువాత వాటిని వినూత్న మార్గాల్లో వివిధ జిల్లాలకు సరఫరా చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇలా తమ అక్రమ వ్యాపారం జోరుగా సాగేందుకు వ్యాపారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇదే క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా కోడి గుడ్ల అట్టల చాటున గుట్కా ప్యాకెట్లను భారీ ఎత్తున తరలించేందుకు రంగం సిద్దం చేసుకున్న నెల్లూరు జిల్లా మనుబోలులోని అక్రమ వ్యాపారుల గుట్టు పోలీసుల అప్రమప్తతతో రట్టయింది. కోట్ల విలువ చేసే గుట్కా, గంజాయి సరుకు పట్టుబడింది. ఈ సరుకును చెన్నై, చిత్తూరు ప్రాంతాల నుంచి గుంటూరు, గోదావరి జిల్లాలకు సరఫరా చేసేందుకు తీసుకువెళుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
వాహనాల తనిఖీ...పారిపోయే ప్రయత్నం...
గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ, సిబ్బంది బుధవారం వేకువన వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద చెన్నై నుంచి నెల్లూరు మార్గం గుండా వెళుతున్న పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న టీఎన్22సీహెచ్4455 నంబర్గల మినిలారీని నిలిపివేసి అందులోని సరుకును తనిఖీ చేస్తుండగా లారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. సీఐ అక్కేశ్వరరావు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు విస్తుపోయే వాస్తవం వెలుగు చూసింది.
గుడ్ల చాటున...గుట్కా, గంజాయి....
లారీలోని వ్యక్తులు తెలిపిన వివరాలతో కోట్ల రూపాయల గుట్కా అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. ఆ లారీలో కోడి గుడ్ల అట్టల చాటున 270 బస్తాల్లో 13,500 గుట్కా ప్యాకెట్లు, 80 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్నపోలీసులు వాటి విలువ సుమారు 1.08 కోట్లు ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయారు.అదే సరుకు వీరు విక్రయిస్తే మార్కెట్ లో మూడు కోట్ల రూపాయల వరకు సొమ్ము చేసుకుంటారని పోలీసులు తెలిపారు.
ఎస్పీ మీడియా సమావేశం...గుట్కా గుట్టు రట్టు
అనంతరం ఈ విషయమై జిల్లా ఎస్పీ రామకృష్ణ విలేఖర్ల సమావేశం నిర్వహించి ఈ అక్రమ రవాణా వివరాలు వెల్లడించారు. గుట్కా అక్రమ రవాణా కోసం కొందరు తెలుగువాళ్లు చెన్నైలో మకాం వేసి మరీ జోరుగా ఈ దందా నడిపిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నేరుగా గుట్కా ప్కాకెట్లను రాష్ట్రంలోకి రప్పించడమే కాకుండా తనిఖీలు ఎక్కువైన సందర్భాల్లో విడి సరుకును చిత్తూరుకు తరలించి అక్కడ ప్యాకెట్ల తయారి చేపడుతున్నట్లు తెలిసిందన్నారు. అలా ఓ ప్రణాళిక ప్రకారం చిత్తూరులోని ఓ పాడుబడిన పరిశ్రమలో గుట్కా తయారీ జరుగుతోందని పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు.
వీళ్లు...దొరికారు...
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కందుల కృష్ణ, బోడగుంట గ్రామానికి చెందిన మోటుపల్లి చంద్రయ్య, చల్లపల్లి మండలంకు చెందిన తాండూరు అశోక్ బాబు గుట్కా రవాణా చేస్తూ దొరికిపోయారని, వీరిపై 272, 273, 353, 120(బీ)ఆర్-డబ్ల్యూ 34 ఐపీసీ, భారతీయ ఆహార భద్రత 2006 చట్టం ప్రకారం సెక్షన్ 58, మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అక్రమ రవాణాకు తరలిస్తున్న మిని లారీ కూడా దొంగిలించినదిగా తమ విచారణలో తేలిందన్నారు. దాడుల్లో పాల్గొన్న సీఐ అక్కేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ రామకృష్ణ అభినందించారు.