జగన్తోనా.. ఎవ్వరితోనైనా చెప్పుకో..ఏమీ పీకలేరు : ఎడిటర్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక జర్నిలిస్టును బెదిరించిన వ్యవహారంలో టీడీపీ అధినేత మొదలు ప్రతిపక్షం పెద్ద ఎత్తున నిలదీసింది. ఇప్పుడు ఏకంగా పత్రికా ఎడిటర్ పైనే దాడి చేసారని జమీన్ రైతు పత్రిక ఎడిటర్ ఆరోపిస్తున్నారు. కొద్ది కాలంగా ఈ పత్రికలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. దీంతో..పత్రిక .. ఎమ్మెల్యే మధ్య వివాదం నడుస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా దాడి జరిగినట్లు చెబుతున్నారు. పత్రిక ఎడిటర్ వీడియో విడుదల చేసారు. కోటంరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేసారు. ఏకంగా ముఖ్యమంత్రితో కాదు ఎవరితో నైనా చెప్పుకో అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తూ దాడి చేసారని పత్రిక ఎడిటర్ ఆరోపిస్తున్నారు.
నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు..కోటంరెడ్డి దాడి చేసారంటూ..
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనపైన ఎమ్మెల్యే దాడి చేసారని జమీన రైతు వార పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో ఉన్న తన ఇంటికి మద్యం సేవించి వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సొంత ఊరికి చెందిన డాక్టర్ వసుంధర, తనతో మాట్లాడి బయటకు వస్తున్న సమయంలో.. ఎమ్మెల్యే ఆమె చేయిపట్టుకుని మళ్లీ ఇంట్లోకి తీసుకువచ్చారని చెప్పారు. వస్తూనే ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో.. అంటూ బెదిరించారని తెలిపారు. అంతటితో ఆగకుండా నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నన్నెవరూ ఏమీ పీకలేరు. ఎవరితో చెప్పుకుంటావ్ ఎస్పీతోనా, మంత్రితోనా, జగన్తోనా ఎవ్వరితోనైనా చెప్పుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ పీకలేరు.. అని బెదిరించారన్నారు. ఇంటివద్దకు వచ్చి రచ్చచేయడం ఏమిటని తాను ప్రశ్నించటంతో వెంటనే ఎమ్మెల్యే కొట్టారని డోలేంద్ర చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఉన్న పీఏ మురళి సహా మరికొందరు కూడా తనపై దాడి చేశారని మీడియా సమావేశంలో జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
గతంలో జర్నలిస్టు వ్యవహారంలోనూ..
కొద్ది రోజుల క్రితం ఒక జర్నిలిస్టును ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ లో బెదిరించిన వ్యవహారం రాజకీయంగా కలకలం రేపింది. దీనిని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో కోటంరెడ్డి ఏ రకంగా మాట్లాడిందీ వివరించారు. అయితే, కోటం రెడ్డి దీని పైన తరువాత వివరణ ఇచ్చారు. నెల్లూరు కొందరు జర్నలిస్టుల పేరుతో దందాలు చేస్తున్నారని.. అటువంటి వ్యక్తిని తాను హెచ్చరిస్తే తాను అనని మాటలను సైతం కట్ అండ్ పేస్ట్ చేసి తనను అప్రతిష్ఠపాలు చేయాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఆ వివాదం ముగిసిపోక ముందే తిరిగి ఇప్పుడు పత్రిక ఎడిటర్ మీద స్వయంగా ఎమ్మెల్యేనే దాడి చేయటం.. అనుచరులతో కలిసి వెళ్లి బెదిరించారనే ఆరోపణలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో అందరూ బాధ్యతగా నడుచుకోవాలని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు తన మీద వస్తున్న ఆరోపణల మీద ఇంకా తన స్పందన ఏంటనేది స్పష్టం చేయలేదు.
అసెంబ్లీలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు
తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాదాస్పదంగా వ్యవహరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఖబడ్దార్ చంద్రబాబు అంటూ పదే పదే రిపీట్ చేస్తూ మాట్లాడిన తీరు పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో సభలో ఆయన తీరు పైన ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కోటంరెడ్డి సభలో ప్రతిపక్ష బెంచ్ ల వైపు కూర్చోవటం.. ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాల పైన కామెంట్లు చేయటం పైన టీడీపీ సభ్యులు అసమనం వ్యక్తం చేసారు. ఆ తరువాత తాము జగన్ కోసం ఏర్పడిన సైన్యం అంటూ చేసిన కామెంట్లు కూడా చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు తిరిగి పత్రక ఎడిటర్ మీద దాడి చేసారని..అందులో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారనే ఆరోపణల మీద ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో.. కోటంరెడ్డి ఏం చెబుతారో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.