విషాదం: సముద్రంలో సెల్ఫీకి ముగ్గురు యువకులు బలి
నెల్లూరు: వారాంతం ఎంతో ఆనందంగా గడపాలనుకున్న ఆ ముగ్గురు యువకులను.. సెల్ఫీ సరదా బలితీసుకుంది. సెల్ఫీ తీసుకుందామని యత్నించిన ఈ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్లో ఆదివారం చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబంతోపాటు వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట రైల్వేవీధి, ఇసుక డొంక ప్రాంతాలకు చెందిన నజీమ్ (22), ముసవీర్ (22) , వైనమూడి హరీష్ (24), సుబ్రహ్మణ్యందేవా, రబ్బానిబాషా, ఫాజిల్, గజేంద్ర ఉదయ్ బీటెక్ పూర్తి చేశారు. వీరిలో ఐదుగురు నగరంలోని హీరోహోండా షోరూంలో పనిచేస్తున్నారు.
కాగా, ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకు స్నేహితులందరూ కలిసి కారులో మైపాడుబీచ్కు వచ్చారు. బీచ్లో సముద్రం ఉత్తరంగా జనాలు లేని చోట మునుగుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో అలల ధాటికి పడిపోయి లోతుకు వెళ్లిపోయారు. అదే సమయంలో రక్షించండంటూ కేకలు పెద్దఎత్తున వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు కామాక్షయ్య తాడుతో రక్షించే ప్రయత్నం చేశారు.
మిగిలిన మత్స్యకారులు బండారయ్య, బాబు, శీనులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వీరిలో నజీమ్, ముసవీర్, హరీష్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృత దేహాలను బయటకు తీశారు. మిగిలిన నలుగురు యువకులను మత్స్యకారులు రక్షించారు. మృతుల్లో నజీమ్, ముసవీర్లు అవివాహితులు కాగా, హరీష్కు ఏడాదిన్నర కిందట వివాహమైంది.
కాగా, నజీం తనింట్లో ఒక్కడే కుమారుడు. ఘటనపై సమాచారమందుకున్న ఎస్సై షరీఫ్ మైపాడు బీచ్ వద్దకు చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తీసుకుని నెల్లూరు నగరంలోని బాధితుల వద్దకు వెళ్లారు. తమకు ఎటువంటి కేసులు వద్దని వారు రాతపూర్వకంగా ఇచ్చారని ఆయన తెలిపారు. ప్రమాదకరమైన రీతిలో సెల్పీలు తీసుకోవడం మంచిది కాదని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.