ఫిరాయింపుదార్లకే అందలమా? నెల్లూరు టీడీపీలో అసమ్మతి ఫైర్: సోమిరెడ్డి వర్సెస్ నారాయణ
అమరావతి/నెల్లూరు: ఏపీలోని అధికార టీడీపీలో పదవుల లొల్లి తీవ్రరూపం దాల్చింది. నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సరి కొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా సాగుతున్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. పార్టీలో సీనియర్, జూనియర్ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు పార్టీ పెద్దలు అగ్ర తాంబూలం ఇస్తూ, అందలం ఎక్కిస్తుండటంతోపాటు దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకుని పని చేసిన కార్యకర్తలకు మొండిచేయి చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా టీడీపీలో పరిణామాలన్నీ మంత్రులు పొంగూరు నారాయణ వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మధ్య గ్రూపు రాజకీయాలుగా మారాయని చెప్తున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీతోపాటు నామినేటెడ్ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కేలా మంత్రి నారాయణ చక్రం తిప్పుతుండటంపై సీనియర్లు ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టారు.
గమ్మత్తేమిటంటే మంత్రి పీ నారాయణకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వద్ద గల పలుకుబడి కలిగి ఉండటంతో ఆయన నిర్ణయాలను నేరుగా ప్రశ్నించే సామర్థ్యం గల నేతలు కరువయ్యారు. దీంతో సీనియర్లు, తొలి నుంచి ఉన్న కార్యకర్తలు తాజాగా ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పక్షాన చేరిపోయారు. తద్వారా నెల్లూరు జిల్లా టీడీపీలో ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి మధ్య మూడు విభేదాలు పొడచూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
కార్యక్రమాలకు దూరంగా మాజీ మంత్రులు
ఇటీవల పార్టీ సీనియర్ నాయకులు కొందరు తమకు న్యాయం చేయాలని అధిష్టానాన్ని కోరడంతోపాటు జిల్లాలో కీలక మంత్రి పొంగూరు నారాయణపైనా ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుదారులను మంత్రి నారాయణ పెద్దఎత్తున ప్రోత్సహిస్తూ చిన్నస్థాయి నామినేటెడ్ పదవులు మొదలు పార్టీ పదవుల వరకు అన్నీ వారికే దక్కేలా చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సీనియర్లు కొందరు పార్టీ వేదికలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు బల్లి దుర్గాప్రసాద్, తాళ్లపాక రమేష్ రెడ్డి నేతల తీరుపై పూర్తి అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్నారని వినికిడి. నామినేటెడ్ పదవి ఏదైనా కేటాయించాలని, కనీసం పార్టీ పదవైనా ఇవ్వాలని పలుమార్లు కోరినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇద్దరూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. మరో సీనియర్ నేత మండవ రామయ్య, కొంతకాలం క్రితం వరకు ఆత్మకూరు ఇన్చార్జ్గా ఉన్న కన్నబాబు, నగరం నుంచి పార్టీలో కీలక బీసీ నేతగా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా ఉన్న డాక్టర్ జడ్ శివప్రసాద్, పార్టీ ఎస్సీ నేత ఎన్.శైలేంద్రబాబు నామినేటెడ్ పదవులు ఆశించి.. మంత్రుల ద్వారా నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నించారు. వారికి న్యాయం చేస్తామని మంత్రులు చెప్పడం మినహా పట్టించుకున్న దాఖలాలు లేవు.
సీఎం బాబు, మంత్రి లోకేశ్ హామీలు హుళ్లక్కేనా?
ముఖ్యంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ పదవికి వేనాటి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పదవికి పోటీపడిన డాక్టర్ జడ్ శివప్రసాద్ రూ.కోట్లు ఖర్చుచేసినా ఓటమి పాలయ్యారు. నామి నేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఇద్దరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హామీ ఇచ్చిన తర్వాత వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అనుబంధ కమిటీల పదవులన్నీ భర్తీ అయ్యాయి. కీలక నామినేటెడ్ పదవులన్నీ పూర్తయ్యాయి. మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఖరారై వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. వాటిలోనైనా తమకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్న నేతలు చేస్తున్న అభ్యర్థనలను టీడీపీ అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
మంత్రి నారాయణ ద్వారా ఇలా ఇతర పార్టీల నేతలకు పదవులు?
టీడీపీ సీనియర్ నేతలంతా మంత్రి నారాయణ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పెద్దఎత్తున పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో మంత్రి నారాయణ నగరానికి చెందిన ఓ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు, మెప్మా పర్యవేక్షణ కమిటీ సభ్యురాలితోపాటు ఎమ్మెల్సీ పదవికి పోటీచేసి ఓడిన నేతను సీఎం వద్దకు తీసుకెళ్లి నామినేటెడ్ పదవి కేటాయించాలని కోరినట్లు సమాచారం. సీఎం స్పందించకపోగా అసహనం వ్యక్తం చేసి ఇప్పటికే చాలా మందికి ఇచ్చానని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాట్ల నరసింహారావు, మంత్రి నారాయణ ద్వారా టీడీపీలో చేరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పదవి పొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ముప్పాళ్ల విజేత జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె నియామకంతో సీనియర్ మహిళా నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్పొరేటర్ ఆనం రంగమయూర్రెడ్డికి జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఖరారు చేశారు. ఇదికూడా సీనియర్లకు మింగుడు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్, జూనియర్ల వివాదం ముదిరి పాకానపడింది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అసమ్మతిని సమసిపోయేలా చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.