తీరానికి కొట్టుకొచ్చిన నేపాల్ ఇంజినీరింగ్ విద్యార్థుల మృతదేహాలు
శ్రీకాకుళం: జిల్లాలోని భావనపాడు సముద్ర తీరంలో గల్లంతైన నేపాల్కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సుమిత్ కుమార్ పటేల్(21), వివేక్కుమార్ గుప్త(22)ల మృతదేహాలు ఆదివారం వజ్రపుకొత్తూరు మండలంలోని డోకులపాడు, చినకొత్తూరు తీరాల మధ్య ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.
సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరంలో శనివారం నేపాల్కు చెందిన తొమ్మిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు స్నానానికి దిగగా.. ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో రాజ్కుమార్ గిరి మృతదేహం శనివారమే ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కాగా, వీరంతా టెక్కలి మండలం కె. కొత్తూరు సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
పాఠశాలలో గుర్తుతెలియని మృతదేహం
విశాఖపట్నం జిల్లా సీలేరు మండలం దారకొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి మృతదేహాన్ని విద్యార్థులు గుర్తించి స్థానికులకు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల కథనం మేరకు మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. అతడు గ్రామానికి చెందిన వ్యక్తి కాదని తెలిసింది. మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా: 8మందికి తీవ్రగాయాలు
పత్తికొండ-కర్నూలు ప్రధాన రహదారిలో కనకదిన్నె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. పత్తికొండలో జరుగుతున్న సదరన్ క్యాంప్కు వెల్దుర్తి నుంచి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు.