హోదా కోసం టీడీపీ సైకిల్ ర్యాలీలో షాకింగ్ ట్విస్ట్: 'సానుభూతి' ప్రమాదాలపై బాబు నిఘా!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ర్యాలీ కార్యక్రమాల సందర్భంగా కొందరు నేతలు ప్రమాదానికి లేదా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలపై చంద్రబాబు ఆరా తీస్తున్నారట.
పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా అందుకే బీజేపీలోకి!: చంద్రబాబుపై మాధవీలత ఫైర్
ఈ మేరకు మీడియాలో కథనం వచ్చింది. అసలు ఈ ప్రమాదాలు నిజంగానే జరుగుతున్నాయా లేక పార్టీ అధిష్టానం దృష్టిని తమవైపు మరలించుకునేందుకు, అలాగే అధినేత సానుభూతి కోసం నేతలు ఇలా ఏమైనా చేస్తున్నారా అనే అంశంపై అధినేత ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందేందుకు సానుభూతి ప్రయత్నాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట.
సైకిల్ ర్యాలీ సందర్భంగా ప్రమాదం, వడదెబ్బ
ఇటీవల ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబుకు సైకిల్ ర్యాలీ సమయంలో వడదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ తదితరులు కూడా వడదెబ్బ బారిన పడ్డారు. మంత్రి అయ్యన్న పాత్రుడు తనయుడు, అయ్యన్న యువసేన అధ్యక్షులు విజయ్ ప్రమాదానికి గురయ్యారు. అతని ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది.
కొందరి తీరు అనుమానాస్పదం
ప్రమాదానికి అనుకోకుండానే జరగవచ్చు. చాలామంది నేతలు నిజంగానే గాయపడి ఉండవచ్చు. ఎక్కువ మంది వాస్తవంగానే వడదెబ్బకు గురయి ఉండవచ్చు. కానీ కొందరు నాయకుల తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అలా చేస్తున్నారా.. చంద్రబాబు ఆరా
సైకిల్ ర్యాలీ సందర్భంగా వరుస సంఘటనలు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధినేత దృష్టిలో పడేందుకు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు పొందేందుకు సానుభూతి కోసం ఎవరైనా చేస్తున్నారా అనే కోణంలో చంద్రబాబు ఆరా తీస్తున్నారట.
గప్చుప్గా ఆరా
ఇంటెలిజెన్స్ ఈ ప్రమాదాల విషయమై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే అంశాలపై గప్ చుప్గా ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కొందరు సానుభూతి కోసం ఇలా చేస్తున్నారని తేలితే అధినేత ఆగ్రహానికి గురికాక తప్పదని అంటున్నారు.
సీట్ల పెంపు లేకపోవడంతో గట్టి పోటీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ల పెంపు 175 నుంచి 225 పెరగాలని టీడీపీ బాగా కోరుకుంటోంది. ఇందుకోసం చాలామంది నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు. కానీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం గట్టి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్లు ఆశించే నేతలు వివిధ మార్గాల ద్వారా అధినేతను ఆకట్టుకునే ప్రయత్నాలను కొట్టి పారేయలేమని అంటున్నారు.
సర్వేల ఆధారంగానే టిక్కెట్లు
అయితే, అధినేత సర్వే ఆధారంగా టిక్కెట్లు ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే ఆయన ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల ఆధారంగా ఆయన టిక్కెట్లు కేటాయిస్తారు. సర్వేల కోసం ఏర్పాటు చేసిన టీంలు ఇప్పటికే ప్రజలతో ఫోన్లు, నేరుగా, ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. వాటి ఆధారంగా టిక్కెట్ ఇవ్వనున్నారు. కొందరు నాయకులు షార్ట్ కట్ మెథడ్ ద్వారా టిక్కెట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.