చైతన్య,నారాయణల్లో ఒకేసారి చదివిన టాప్ ర్యాంకర్లు:ఇదెలా సాధ్యమంటూ నెటిజన్ల సెటైర్లు
విజయవాడ:విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలైన చైతన్య,నారాయణ చేస్తున్న విన్యాసాలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివిధ ఎంట్రన్స్ ల్లో టాప్ ర్యాంక్ వచ్చిన వారిని వీరు మా విద్యార్థులేనంటూ ఈ రెండు సంస్థలు ప్రకటించుకోవడంపై ఆయా విద్యార్థుల ప్రకటనల ఫోటోలను జతచేసి మరీ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
వాటికి ఆకర్షణీయమైన మ్యాటర్ ను జతచేస్తున్నారు. మచ్చుకు ఒక నెటిజన్ రాసిన అలాంటి పంచ్ డైలాగ్ ఇది. "మీరందరూ...ఒకేసారి రెండు చేతులతో రాసే వాళ్ళని చూసుంటారు...ఒకేసారి ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపే వాళ్ళని చూసుంటారు...కాని...ఒకేసారి రెండు కాలేజీల్లో చదివి ఒకే పరీక్ష లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా....చూడలేదా?....అయితే చూడండి.."అంటూ పేపర్లలో వచ్చిన ఆ విద్యార్థుల ప్రకటనలను సైతం నెటిజన్లు జోడించడం విశేషం. వివరాల్లోకి వెళితే...
ఇటీవల జరిగిన జెఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యార్థులు బి.సూరజ్ కృష్ణ ఫస్ట్ ర్యాంక్, హేమంత్ కుమార్ సెకండ్ ర్యాంకు సాధించారంటూ శ్రీ చైతన్య సంస్థ ప్రముఖ దినపత్రికల్లో అడ్వరటైజ్ మెంట్లు ఇచ్చింది. దీంతో ప్రతిష్టాత్మకమైన జెఈఈ మెయిన్స్ లో చైతన్య నే టాప్ ర్యాంకులు సాధించిందని అందరూ భావించారు.
అయితే విచిత్రంగా ఆ తరువాత అవే పేపర్లలో ఇదే విద్యార్థులు నారాయణ సంస్థల్లో చదివి జెఈఈ మెయిన్స్ లో ఫస్ట్,సెకండ్ ర్యాంకులు సాధించినట్లు ప్రకటనలు ఉండటంతో చూసినవాళ్లు నివ్వెరపోయారు. పైగా నారాయణ ప్రకటనలో మరో ఆరోపణను కూడా హైలెట్ చేయడం గమనార్హం. అదేమిటంటే" ఇతర విద్యాసంస్థల వలే తాము వేరే రాష్ట్రాల విద్యాసంస్థలు కొని ఆ ర్యాంకులు ప్రకటించలేదు"...అంటే అలాకూడా చేస్తున్నారని వారే కార్పోరేట్ విద్యాసంస్థల మాయాజాలాన్ని బైటపెట్టుకుంటున్నారు.
ఇక ఈ ప్రకటనలు చూసిన వారు ఆ ఇద్దరు విద్యార్థులు ఒకేసారి ఈ రెండు సంస్థల్లో ఏకకాలంలో చదవడం ఎలా సాధ్యపడిందో తెలీక విస్తుపోయారు. ఇలా ప్రకటనలు ఇస్తే నిజంగా ఈ విద్యార్థులు ఏ సంస్థలో చదివారో ఎలా తెలుస్తుందని, ఏ సంస్థలో చదివితే ఆ సంస్థే ప్రకటన ఇవ్వాలి కానీ ఇలా వేరే సంస్థ కూడా అబద్దపు ప్రకటనలు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. అయినా అంత పెద్ద కార్పోరేట్ సంస్థలు అయి ఉండి విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు ఇలా ఛీప్ ట్రిక్ లు ప్లే చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక ఇదే విషయం నెటిజన్ మేధావుల దృష్టిలో పడటంతో చైతన్య,నారాయణల విన్యాసాలపై సెటైర్ల దాడి మొదలు పెట్టారు. అయినా ఇలాంటి వ్యవహారాల్లో ముదిరిపోయిన కార్పొరేట్ సంస్థలకు ఈ సెటైర్లు,వ్యంగాస్త్రాలు ఓ లెక్కా!