అవినీతికి పాల్పడలేదు, కాణిపాకంలో కామినేని సత్య ప్రమాణం
చిత్తూరు: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు శుక్రవారం నాడు ప్రమాణం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది, దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కూడ బిజెపి మంత్రులు రాజీనామాలు చేశారు. కేంద్ర మంత్రుల రాజీనామాను రాష్ట్రపతి, రాష్ట్ర మంత్రుల రాజీనామాలు గురువారం రాత్రే ఆమోదం పొందాయి.
రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. మంత్రిగా ఉన్న సమయంలో తాను ఎవరి వద్ద నుండి ఒక్క పైసా తీసుకోలేదని మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. అంతేకాదు ఈ విషయమై కాణిపాకం వరసిద్ది వినాయకస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు.
ఈ ప్రకటన మేరకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం నాడు కాణిపాకం వినాయక ఆలయంలో ప్రమాణం చేశారు. అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడంతో తన ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు.
మంత్రి పదవిలో ఉన్న సమయంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మరోసారి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.ఎన్డీఏలో ఇంకా టిడిపి కొనసాగుతోందని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తాము రాష్ట్ర మంత్రివర్గం నుండి వైదొలిగినట్టు కామినేని శ్రీనివాస్ చెప్పారు.