కొత్త కోణాలు: 'బోటు'లో ఆ అధికారి పెట్టుబడులు.. కొండలరావు కొత్త డ్రామా, అఖిలప్రియపై విమర్శలు..
విజయవాడ: కృష్ణా నది బోటు ప్రమాద ఘటన విచారణపై పలు అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అసలు సూత్రధారులు తెర వెనుక ఉన్నారని, బోటు యజమానిగా ఉన్న కొండలరావు లాంటివాళ్లు కేవలం చిన్న చేపలేనన్న వాదన వినిపించింది.
Recommended Video
ఇవీ లింకులు: తీగ లాగితే డొంకంతా!.. బోటు విషాదంతో వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు
ఇప్పుడా వాదనకు బలం చేకూర్చేలా విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బోటు రిజిస్ట్రేషన్ కొండలరావు పేరు మీదనే ఉన్నా.. దాని వెనుక ఉన్నది మాత్రం టూరిజం అధికారేనని చెప్పారు.
ఎవరా అధికారి:
రివరింగ్ బోటును కొండలరావు పేరిట రిజిస్ట్రేషన్ చేయించి.. టూరిజం అధికారి కొల్లి శ్రీధర్ తెర వెనుక ఉండి కథ నడిపించినట్టు సీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దీంతో ప్రైవేటు బోట్లలో పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు నిజమేనన్న విషయం నిర్దారణ అయింది. అధికారుల అండదండలతోనే ఈ ప్రైవేట్ బోటు మాఫియా వర్దిల్లుతోందన్న విషయం కూడా సీపీ వ్యాఖ్యలతో స్పష్టమైంది.
ఏడుగురి సస్పెండ్:
బోటు మాఫియాలో కొల్లి శ్రీధర్ ఇతరులతోను పెట్టుబడులు పెట్టించినట్టు తెలుస్తోంది. బోట్లను కొనుగోలు చేయడం, రివరింగ్ బోటును స్థాపించడం వెనుక కొల్లినేని శ్రీధరే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులకు.. కొండలరావు మరిన్ని పేర్లను వెల్లడించినట్టు సమాచారం.
ఆ పేర్లను సీపీ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆ నివేదిక అందిన తర్వాతే పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వేటుపడ్డ వాళ్లలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నట్టు సమాచారం.
లాబీయింగ్:
ప్రైవేటు బోటు మాఫియాను నడపడంలో ఉన్నతాధికారులను లాబీయింగ్ ల ద్వారా మేనేజ్ చేసిన కొల్లి శ్రీధర్ అండ్ కో.. ఇప్పుడు కూడా లాబీయింగ్ లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఉన్నతాధికారులకు లంచాలు ఇవ్వడానికి ఈ గ్యాంగ్ ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
అయ్యప్ప మాలతో కొత్త డ్రామా:
ప్రమాదానికి గురైన బోటు యజమాని కొండలరావు కూడా కొత్త ఎత్తులు వేస్తున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కేవలం గంట ముందు ఆయన అయ్యప్ప మాల వేసుకున్నారు. మాల వేసుకోవడం ద్వారా ఖాకీ మర్యాదల నుంచి తప్పించుకోవచ్చని కొండలరావు భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ తన వెనుక ఉన్న సూత్రధారులను కాపాడటానికి కొండలరావు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. మీడియా ముందు మాత్రం తనకేం చేయాలో పాలుపోవడం లేదని చెప్పుకొచ్చాడు కొండలరావు.
అఖిలప్రియ వివాదాస్పద వైఖరి:
బోటు ప్రమాదం జరిగిన నాటి నుంచి మంత్రి అఖిలప్రియ అధికారులను వెనకేసుకొస్తూనే ఉన్నారు. మంగళవారం నాటి ప్రెస్ మీట్ లో కూడా ఆమె అధికారులను తప్పుపట్టడానికి అవకాశం ఇవ్వలేదు. తీరా ఇప్పుడు అధికారుల పాత్ర బయటపడటంతో వాళ్లను కాపాడటానికి ఆమె ప్రయత్నించారా? అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. అయితే అఖిలప్రియ మాత్రం దీనిపై కమిటీ వేసి నిజాలు నిగ్గు తేలుస్తామంటున్నారు.