జగన్ తో కొత్త సీఐడీ ఛీఫ్ సంజయ్ భేటీ- తన ప్రయారిటీ చెప్పేసిన సీఎం..
ఏపీలో తాజాగా ప్రభుత్వం సీఐడీ ఛీఫ్ ను బదిలీ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సీఐడీ ఛీఫ్ గా కొనసాగిన పీవీ సునీల్ కుమార్ స్ధానంలో మరో సీనియర్ అధికారి ఎన్ సంజయ్ ను నియమించింది. దీంతో సంజయ్ ఇవాళ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తగా సీఐడీ ఛీఫ్ గా నియమితులైన ఎన్ సంజయ్ ఇవాళ సీఎం వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. సీఐడీ ఛీఫ్ గా బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అంచనాలకు తగినట్లుగా పనిచేస్తానని ఆయన సీఎం జగన్ కు తెలిపినట్లు తెలుస్తోంది. సీఐడీ ఛీఫ్ గా ఆయన ప్రాధాన్యతల్ని సీఎం జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించి పని చేసుకోవాలని జగన్ సంజయ్ కు సూచించినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ ఛీఫ్ గా నియమితులైన పీవీ సునీల్ కుమార్ తాజాగా బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయన్ను అనూహ్యంగా సీఐడీ ఛీఫ్ పోస్టు నుంచి తప్పించింది. అంతే కాదు సునీల్ కు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించింది. దీంతో ఆయనకు ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించనుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అదే సమయంలో సీఐడీ ఛీఫ్ గా నియమితులైన సంజయ్ కు మాత్రం విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.