ఆర్నెల్లలో కొత్త రాజధాని: జైరామ్, చేసేదేం లేదు: కోట్ల
సీమాంధ్ర రాజధాని నిర్ణయం కోసం నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తామని, రాజధాని ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లో ఆ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి సీమాంధ్రలో కలుపుతామని, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను తెలంగాణలో ఉంచనున్నట్లు చెప్పారు. కొత్త రాష్ట్రానికి అపాయింటెడ్ డేట్ మూడు నెలలు పట్టే అవకాశముందన్నారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల విషయంలో అదే జరిగిందన్నారు.
సీమాంధ్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు కోసం డిప్యూటీ చైర్మన్ నేతృత్వంలోని ప్లానింగ్ కమిషన్లో ప్రత్యేక సెల్ ఉంటుందన్నారు. ఇది వచ్చే వారం నుండి పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 84వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉందన్నారు. రెండు ప్రాంతాల నేతలు పరస్పరం విమర్శలు మాని సహకరించుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి 90 శాతం గ్రాంటు నిధులు, పది శాతం రుణం ఉంటుందన్నారు.
అమరవీరుల వల్లే: రేణుకా చౌదరి
అమరవీరుల వల్లే తెలంగాణ వచ్చిందని, వారి కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించి, ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తి వేయాలన్నారు. అమర వీరుల స్థూపం ఏర్పాటు చేయడానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులకు రాజకీయావకాశాలు కల్పించాలని కోరారు.
భౌగోళికంగా విడిపోయినప్పటికీ, తెలుగు వారందరం కలసి అభివృద్ధి చెందుదామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీ అయితే కొందరు తమ వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలుగు వాళ్లమంతా కలిసి మెలిసి అభివృద్ధి చెందుతామన్నారు.
సిఎం రేసులో లేను: కోట్ల
విభజన జరిగిపోయిందని, ఇప్పుడు చేసేదేమీ లేదని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. తాను సిఎం రేసులో లేనన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.