ఎపి భవన నిర్మాణ రంగంలో...మరో సరి కొత్త పాలసీ...త్రీడీ ప్లాన్ ఉంటేనే అనుమతి...
అమరావలి: ఎపి ప్రభుత్వం పరిపాలనా విధానంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టనుంది. హైటెక్ సిఎంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి నిర్మాణ రంగంలో టెక్నాలజీ ప్రాధాన్యతను పెంచారు. ఈ రంగంలో ఇంతకుముందు లాగా బ్లూ ప్రింట్ ఆధారంగా కాకుండా త్రీడీ ప్లాన్ ఉంటేనే నిర్మాణ అనుమతులు ఇస్తారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఎపి గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఏదైనా భవన నిర్మాణానికి అనుమతి తీసుకోవాలంటే పెద్ద పెద్ద చార్టులు...వాటిపై రేఖా చిత్రాలు...ఇది హాలు, ఇది బెడ్ రూమ్, ఇది కిచెన్ అంటూ చూపించడంతో పాటు నిర్మాణ స్థలం చుట్టూ వదిలిన ఖాళీ స్థలం...వాటి తాలూకు కొలతలు...ఇవన్నీ'బ్లూ ప్రింట్' సమర్పించాలి. అయితే ఇక ఆ పాత పద్దతి పోయి ఎపి నిర్మాణ రంగంలో ఒక సరికొత్త విప్లవాత్మక మార్పు చోటుచేసుకోనుంది...అదే...బిమ్..అంటే...బిల్డింగ్ మ్యాప్ మోడలింగ్.
బిల్డింగ్ మ్యాప్ మోడలింగ్...అంటే ఏంటంటే...
ఇకపై ఏదేని భవన నిర్మాణానికి అనుమతి తీసుకోవాలంటే...నిర్మించబోయే భవనం బాహ్య ఆకృతితోపాటు...లోపలి గదుల ఆకృతులూ కొలతలతో సహా పూర్తిస్థాయిలో త్రీడీలో పొందుపరచాలి. భవనం వెలుపలి వివరాలతో పాటు లోపల హాలు, బెడ్రూమ్లు, బాత్రూమ్లు, బాల్కనీ ఇతరత్రా నిర్మాణాలన్నీఖచ్చితమైన కొలతలతో చూపించాలి. పైగా నిబంధనల ప్రకారం భవన నిర్మాణంలో ఏ పనికి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నామో కూడా చెప్పాలి. ఇటుక, సిమెంటు, మార్బుల్ ఇలా నిర్మాణానికి సంబంధించిన ప్రతి వివరం పొందుపరచాలి.
ముందుగా...సిఆర్డిఎ పరిధిలో...
ముందుగా ఈ బిమ్ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతులు పొందే విధానాన్ని సిఆర్ డిఎ అమలు లోకి తేనుంది. రాజధాని అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల పంపిణీ జోరందుకున్న నేపథ్యంలో నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ భవన నిర్మాణాలూ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను నిబంధనలకు విరుద్దంగా చేపడితే ముందు ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఖచ్చితత్వాన్ని నిర్దేశించేలా ‘బిమ్' విధానంలో ప్లాన్లను ఆమోదించాలని సీఆర్డీయే నిర్ణయించింది.
నిబంధనలు...ఉల్లంఘించలేరు...
ఈ బిమ్ విధానంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. గతంలో చార్టులపై గీసిచ్చే ప్లాన్ల లెక్క వాస్తవంలో చాలా సార్లు వేరుగా ఉంటుంది. ప్లాన్ లో చూపించే కొలతలు ఒకటి...అసలు నిర్మాణంలో కొలతలు మరొకటి...చిన్నచిన్నఉల్లంఘనల నుంచి భారీ స్థాయి వరకు ఉల్లంఘనలు సర్వసాధారణంగా జరిగేవి. అయితే బిమ్ లో ఇలా కుదరదు. భవనం బాహ్య ఆకృతితోపాటు లోపలి గదుల ఆకృతులూ కొలతలతో సహా పూర్తి పిక్చర్ త్రీడీలో పొందుపరచాల్సి ఉన్నందున ఇక నిబంధనల ఉల్లంఘన సాధ్యపడదు.
అనుమతి రాగానే...అయిపోదు...
సరే...ఇలా త్రిడీ ప్లాన్ ఇచ్చి అనుమతి పొందాక ఇప్పట్లానే ఇష్టమొచ్చినట్లు కొలతలు మార్చి కట్టుకుంటే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే...బిల్డింగ్ ప్లాన్కు అనుమతి ఇచ్చిన తర్వాత...క్షేత్రస్థాయిలో ఆ ఇంటి స్థలాన్నిజీపీఎస్ తో అనుసంధానిస్తారు. తద్వారా భవన నిర్మాణంలో ప్రతి దశను అధికారులు పరిశీలిస్తూనే ఉండవచ్చు. నిర్మాణాన్నిహద్దుల్లోనే కడుతున్నారా?...ప్లాన్ లో ఎన్ని పిల్లర్లు వేస్తామన్నారు? వాస్తవంలో ఎన్ని వేశారు? చెప్పిన సైజులోనే వేశారా? ఇలా ప్రతి అంశాన్ని సీఆర్డీయే ఆఫీసులోనే కూర్చుని అధికారులు గమనించవచ్చు. దీంతో ఇక నిబంధనల ఉల్లంఘనకు అవకాశమెక్కడిది?...
బిమ్ వల్ల...ప్రయోజనాలు...
భవన నిర్మాణ ప్రణాళికల్లో బిమ్ అత్యంత అత్యాధునికమైనది. దీనినే...వర్చువల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్...అని కూడా పిలుస్తారు. భవనం ఎలా ఉంటుందో ‘బిమ్'లో ముందే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది కాబట్టి అసలు నిర్మాణంలో ఎలాంటి తేడా వచ్చినా ఇటు యజమానికి అటు అధికారులకు తెలిసిపోతుంది. దీంతో వెంటనే తగిన చర్యలు తీసుకోవచ్చు. అలాగే గేటెడ్ కమ్యూనిటీల వంటి భారీ నిర్మాణాలకు సైతం ‘బిమ్'లో ..ఖచ్చితమైన..ప్రయోజనకరమైన..లాభదాయకమైన ప్రణాళికలు రూపొందించవచ్చు. అంతేకాదు నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఎక్కడైనా విద్యుత్తు, మురుగునీటి పారుదలలో ఏదైనా ఇబ్బంది వస్తే నిర్దిష్టంగా ఎక్కడ సమస్య తలెత్తిందో కూడా సునాయాసంగా గుర్తించవచ్చు.
బిమ్ వల్ల...మరిన్ని ప్రయోజనాలు...
ఈ ‘బిమ్' విధానం ద్వారా చేపట్టే ప్రాజెక్టులు చిన్నవైనా పెద్దవైనా కాంట్రాక్టు సంస్థలు అస్సలు మోసం చేయలేవు. దేశంలో ఎక్కడ ఏ పనిని చేపట్టినా ఉదాహరణకు సిక్కింలో రోడ్డు వేసే పనిని ఎపిలో ఉండే పరిశీలిస్తూ ఉండొచ్చు. ఈ రోడ్డు నిర్మాణంలో వాడే సామగ్రి నుంచి కొలతల దాకా ప్రతి విషయంలో ఎక్కడ లెక్కతప్పినా స్ఫష్టంగా తెలిసిపోతుంది. అలాగే ఫర్నీచర్కు కూడా ఈ ‘బిమ్' విధానాన్ని వర్తింపచేయొచ్చు. ప్లాన్ డిజైనింగ్, డిటైల్డ్ ఎస్టిమేషన్స్ వంటి దశలన్నీసులభంగా, వేగంగా పూర్తవుతాయి. దీనివల్ల సమయం చాలా ఆదా అవడమే కాదు వందశాతం ఖచ్చితత్వం ఉంటుంది. ఆక్రమణలు, భూరికార్డుల ట్యాంపరింగ్, క్షేత్రస్థాయిలో నిర్మాణ అతిక్రమణలకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండదు.
దేశంలోనే తొలిసారిగా...మన రాష్ట్రంలోనే...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ది చెందిన దేశాల్లో ఈ బిమ్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే మనదేశంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ఈ టెక్నాలజీని వినియోగించడం మాత్రం ఇదే తొలిసారి. సీఆర్డీయే పరిధిలో బిమ్ పద్ధతిలో ప్లాన్లు తయారు చేసేందుకు వీలుగా ఇటీవల లైసెన్స్డ్ సర్వేయర్లకు విజయవాడలో ఓ వర్కుషాప్ కూడా నిర్వహించడం జరిగింది...సో...బి రెడీ ఫర్ న్యూ ఛేంజ్...