క్షత్రియ సమాజం వార్నింగ్ వెనుక : నేటి పత్రికల్లో మంత్రి కౌంటర్ : సంచయిత అదే వర్గంగా ..దుమారం ఆగదా..!!
ఏపీలో సామాజిక వర్గాలే అధికారాన్ని..రాజకీయాలను శాసిస్తాయి. ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గం ఇచ్చిన ఒక పత్రికా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో 2019 జగన్ అధికారంలోకి వస్తూనే తన కేబినెట్ సమీకరణాల్లో భాగంగా క్షత్రియ వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. రఘురామ రాజు ఎంపీగా గెలిచారు. తొలుత పార్టీలో ఎంపీ రఘురామ రాజు వ్యవహారం అనేక మలుపులు తీసుకుంది. ఇక, తాజాగా రెండు రాష్ట్రాల క్షత్రియ సమాజం పేరుతో ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు.
క్షత్రియ సమాజం పేరుతో ప్రకటనతో..
ఆ ప్రకటనలో ....రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌరవ మర్యాదలతో జీవన విధానాన్ని సాగిస్తున్న సామాజిక వర్గం క్షత్రియ సమాజం. మాలో నూటికి 99 శాతం మంది సామాజిక, రాజకీయ విమర్శలకు చాలా దూరంగా ఉంటారని పేర్కొన్నారు. సంస్కార విలువల కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంస్కృతి క్షత్రియులదని... మా సామాజిక వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజుపై రాజ్యసభ సభ్యులు అసభ్య భాష వాడిన సంఘటన మూలంగా మా సమాజంలో కొంత ఆవేదన నెలకొందని పేర్కొన్నారు. మా క్షత్రియులలోని ఒక ప్రఖ్యాతిగాంచిన రాజవంశానికి చెందిన, ఎన్నో ఉన్నత పదవులను అధిష్టించిన పూసపాటి అశోక్ గజపతిరాజుపై సంబోధించిన విధానం చాలా అమర్యాదకరంగా ఉందని ప్రస్తావించారు.
ఎంపీ..మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం..
అందువల్లే మా క్షత్రియ సమాజం నుంచి వ్యక్తమైన భావాలను మీకు (సీఎం) విన్నవిస్తున్నామంటూ.. ముఖ్యంగా విజయనగర రాజవంశానికి చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు తో పాటుగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలపైన చేస్తున్న అసత్య ప్రచారం, మంత్రి వర్గ సభ్యుల విమర్శలు, ఆయన వాడిన అసభ్యకర పదజాలం, ఆ మంత్రిగారి స్థాయిని, మీ ప్రభుత్వ స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడారంటూ ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇక, ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు కారణమైంది.
కౌంటర్ గా మంత్రి పత్రికా ప్రకటన..
దీనికి ప్రతిగా ఈ రోజు పత్రికల్లో మంత్రి రంగనాధ రాజు పేరుతో ఒక ప్రకటన ఇచ్చారు. అందులో ముందుగా క్షత్రియ సమాజం పేరుతో ఇచ్చిన ప్రకటన ఇచ్చినది ఎవరో తెలియదని పేర్కొన్నారు. ఒక పార్టీకి కొమ్మకాస్తూ ఇచ్చిన మద్దతుగా కనపడందని అభిప్రాయపడ్డారు. రాజకీయ అంశాలకు కులపరమైన రంగులు పులుముకుంటూ ఇచ్చిన ప్రకటనగా పేర్కొన్నారు. అశోక్ గజపతి రాజు క్షత్రియురాలైన సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని కోరారు. ఇక, మాన్సాస్ ట్రస్టులో ఇప్పటి వరకు జరిగిన అంశాలను తిరిగి ప్రకటనలో వివరించారు.
Recommended Video
కుల సంఘాల జోక్యం సరికాదు..
అశోక్ గజపతి తండ్రి పైన ఆ ప్రకటనలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాజకీయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రుగుతున్న వ్యవహారాలలో కుల సంఘాల జోక్యం సరికాదంటూ మంత్ర రంగనాధ రాజు సుదీర్ఘంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరించారు. అయితే, అశోక్ గజపతి చేసిన తప్పులను ఎత్తి చూపటంలో అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు..పరుష పదజాలమే ఈ దుమారానికి కారణమనే చర్చలు సాగుతున్నాయి. అయితే, సామాజిక వర్గాల ప్రాధాన్యతలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్..నాటి టీడీపీ ప్రభుత్వంలో క్షత్రియ వర్గానికి ప్రాతినిధ్యం లేదంటూనే..తన కేబినెట్ లో రంగనాద రాజుకు కీలకమైన హౌసింగ్ శాఖను అప్పగించారు. అయితే, ఏపీలో ఏ రాజకీయ అంశమైన సామాజిక వర్గాలతో ముడి పడి ఉండటం సాధారణమే. ఇప్పుడు క్షత్రియ వర్గం ప్రకటన..కౌంటర్ గా మంత్రి ఇచ్చిన వివరణతో కూడిన ప్రకటన తో ఈ వ్యవహారం ముగుస్తుందా..లేక మంత్రి చేసిన ప్రకటనకు స్పందనగా మరో ప్రకటన వస్తుందా అనేది చూడాల్సి ఉంది.