నాడు వైయస్..నేడు జగన్: టీటీడీ ఛైర్మన్ నియామకంలో అదే వివాదం: సుబ్బారెడ్డి ఛైర్మన్ అవుతారా..!
Recommended Video
నాడు వైయస్సార్..నేడు జగన్. తండ్రి..తనయుడు ఇద్దరూ ఒకే నియామకంలో ఒకే రకమైన ఇబ్బందులు. నాడు టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర రెడ్డిని నియమిస్తూ వైయస్ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో అనేక వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఆయన ఆ పదవికి ఆర్హడు కాదనే విమర్శలు వినిపించాయి. అయినా..నాడు వైయస్ ముందుకే వెళ్లారు . ఇక, ఇప్పుడు జగన్కు దాదాపు అదే పరిస్థితి. టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారు చేసారనే సమాచారంతో అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. మరి..జగన్ ముందకే వెళ్తారా..ఆలోచిస్తారా..
నాడు వైయస్ హయాంలో..భూమన
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా తనకు అనుచరుడిగా వ్యవహరించిన భూమన కరుణాకర రెడ్డిని నియమించారు. కరుణాకర రెడ్డిని నియమించిన వెంటనే అనేక ఆరోపణలు వచ్చాయి. నాస్తికుడు..విప్లవ కారుడు..హిందువు కాదు..ఇలా అనేక రకాలైన ప్రచారం కరుణా కరరెడ్డి మీద జరిగింది. అయితే, నాడు వైయస్ ఇవన్నీ పట్టించుకోలేదు. కరుణాకర రెడ్డి మీద అవన్నీ నిరాధార ఆరోపణలే అని..వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేసారు. అదే విధంగా కరుణాకర రెడ్డి సైతం టీటీడీ చైర్మన్గా ఎన్ని ఆరోపణలు తన మీద వచ్చినా..కొత్త తరహా కార్యక్రమాలకు రూప కల్పన చేసారు. దళిత గోవిందం, వాడ వాడలా శ్రీనివాస కళ్యాణం, సామూహిక వివాహాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన కాల పరిమతి ముగిసిన తరువాత రాజకీయ కారణాలతో వైయస్ టీటీడీ చైర్మన్ ఆది కేశవులు నాయుడుకి అప్పగించారు.
నేడు జగన్ హయాంలో..సుబ్బారెడ్డి..
ఇక, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. టీటీడీ చైర్మన్గా తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. అంతే, అప్పుడే సోషల్ మీడియా వేదికగా అసలు సుబ్బారెడ్డి హిందువు కాదంటూ.. ఆయన క్రిస్టియన్ అంటూ వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలి నుండి హిందువే. ఆయన క్రైస్తవ మతం తీసుకోలేదు. తొలి నుండి ఆధ్యాత్మిక కార్యాక్రమాలు..దేవాలయాల సందర్శన.. నిత్యం నుదుటి మీద బొట్టుతో కనిపిస్తారు. అయితే, ఇదే వీకిపీడియాలో సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని చూపిస్తున్న అంశానని హైలైట్ చేస్తూ..టీటీడీ ఛైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంతలోనే సడన్గా వీకిపీడియాలో సైతం సుబ్బారెడ్డి ని అప్పటి వరకు క్రిస్టియన్గా చూపించి..కొద్ది సేపటికే హిందువుగా మార్చేసారు. వీకిపీడియాలో ఎవరైనా మార్పు చేసే అవకాశం ఉండటంతో రాజకీయ విమర్శల కోసమే ఇటువంటి ప్రచారానికి దిగుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
జగన్ ఏం చేస్తారు..
ఇక, ఇప్పుడు సుబ్బారెడ్డి విషయంలో వస్తున్న ఆరోపణల పైన జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. జగన్ కొంత కాలంగా స్వామీజీలు..తిరుమల దర్శనాలు..ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. టీటీడీ లో పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్న జగన్..అక్కడ ఈవో మొదలు అధికారుల మార్పు విషయంలోనూ కసరత్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారానికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాల్సిందే..