మూడు రాజధానులపై కొత్త డెడ్లైన్- జగన్ దూకుడు- వెంటాడుతున్న విపక్షం....
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు ఈ నెలలోనే తొలి అడుగు పడబోతోందా ? అందుకు సీఎం జగన్ ఆగస్టు 16 ముహుర్తం ఫిక్స్ చేసేశారా ? రాజధానుల గెజిట్లపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టులో హడావిడిగా సవాల్ చేయడం వెనుక ఉద్దేశం ఇదేనా అంటే అవుననే సమాధానం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోగా మూడు రాజధానుల ప్రక్రియ పట్టాలెక్కుతుందని అంచనా వేస్తున్నారు.
కోర్టులవైపే చూపు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఇప్పుడు అందరి చూపూ న్యాయస్ధానాల పైకే మళ్లింది. రాజధానుల ఏర్పాటుకు అవసరమైన శాసన ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ప్రభుత్వంతో పాటు అమరావతి రైతులు, టీడీపీ కూడా కోర్టు తీర్పుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి. ఒక్క హైకోర్టులోనే ఇప్పుడు రాజధానికి సంబంధించి దాదాపు 40 పిటిషన్లు దాఖలై ఉన్నాయి. ఇవి కాకుండా తాజాగా గవర్నర్ ఆమోదం పొందిన బిల్లులపై మరో పిటిషన్ దీనికి అదనం. ఈ పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. దీంతో ఆ రోజు ఏం జరగబోతోందనే ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పీ సోమవారం విచారణకు రానుంది.
సుప్రీంలోనూ కౌంటర్ పిటిషన్లు...
ఏపీలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిన రాజధాని బిల్లులపై దాఖలైన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ నెల 14 వరకూ స్టేటస్ కో విధించింది. ఆ లోపు దీనిపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ సోమవారం జరుగుతుందని భావిస్తుండగా... ఇందులో ఏదైనా కీలక ఆదేశం వెలువడుతుందన్న అనుమానంతో రాజధాని రైతులు సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టులోనూ రాజధాని బిల్లుల వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఆగస్టు 14 డెడ్లైన్...
ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదమద్ర పడగానే వేగంగా పావులు కదుపుతున్న ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు చికాకు కలిగిస్తున్నాయి. అయితే ఉన్నంతలో ఊరటగా హైకోర్టు స్టే విధించకుండా స్టేటస్ కో విధించి కౌంటర్లు దాఖలు చేయాలని కోరడం మాత్రం ప్రభుత్వానికి సానుకూల అంశంగానే చెప్పవచ్చు. ఈ నెల 14న జరిగే విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం వీటిపై విచారణ జరిపి హైకోర్టు ఓ కీలక నిర్ణయం వెలువరించడం ఖాయమనే అంచనాలున్నాయి. అయితే రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లపైనా అదే రోజు విచారణ జరగనుండటంతో ఆగస్టు 14 ఇప్పుడు జడ్జిమెంట్ డేగా మారిపోయింది.
రైతులతో కలిసి టీడీపీ పావులు...
అటు రాజధాని వ్యవహారంపై ప్రభుత్వ దూకుడుతో అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఇవాళ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన రైతులు.. హైకోర్టుకు అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరికి టీడీపీ నుంచి అవసరమైన తోడ్పాడు అందుతుండటంతో ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో అకౌంటెంట్ జనరల్ పాత్ర కూడా కీలకంగా మారడంతో ఆయన్ను ప్రతివాదిగా చేర్చాలనే మరో పిటిషన్ ను కూడా హైకోర్టు ఆమోదించనుంది. ఆ తర్వాత ఆయన అమరావతిలలో రాజధాని పేరుతో పెట్టిన ఖర్చు లెక్కలు ఖరారు చేస్తారు. వీటి ఆధారంగా ఆగస్టు 14న హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలున్నాయి.