ఏపీ సర్కార్.. వాట్ నెక్స్ట్: కేంద్రం ఝలక్: ఆ పథకానికి బ్రేక్ పడినట్టేనా?: జగన్ స్పందనేంటీ?
అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధనను కొనసాగించడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం.. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేపట్టడానికి సన్నాహాలు చేస్తోన్న ప్రభుత్వ చర్యలకు నూతన విద్యావిధానం ద్వారా బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
మోడీకి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు: ప్రధాని సారథ్యంలో: నూతన విద్యా విధానానికి జై
ఇంగ్లీష్లో విద్యాబోధనపై ప్రభావం..
విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ రూపొందించిన విద్యా విధానాన్ని దేశంలో అమల్లోకి తీసుకుని రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీని ప్రభావం ఇంగ్లీష్లో విద్యాబోధనను చేపట్టాలంటూ జగన్ సర్కార్ తీసుకుంటోన్న చర్యలపై పడే అవకాశాలు లేకపోలేదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. దీన్ని సవాల్ చేసే పరిస్థితి లేదు.
విమర్శలు, ఆందోళనలు ఎదురైనా..
ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించాలంటూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై వివాదాలు, విమర్శలు తలెత్తాయి. న్యాయస్థానాల నుంచీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ దుమారం గురించి చెప్పుకోనక్కర్లేదు. వైసీపీయేతర అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. భాషాభిమానులు కూడా ఆందోళనను వ్యక్తం చేశారు. మాతృభాషను ప్రభుత్వం మృత భాషగా మార్చబోతోందంటూ ప్రభుత్వంపై విమర్శలను గుప్పించారు.
గ్రామీణ విద్యార్థులకు మేలు కలుగుతుందనే..
అయినప్పటికీ.. విద్యార్థులకు మేలు కలుగుతుందనే ఉద్దేశంతో దీని నుంచి వెనక్కి తగ్గలేదు ప్రభుత్వం. గ్రామీణ విద్యార్థులకు పాఠశాల విద్య దశలోనే ఇంగ్లీష్పై పట్టు లభిస్తుందనేది ప్రభుత్వం ఉద్దేశం. ఫలితంగా- పోటీ వాతావరణాన్ని తట్టుకోగలుగుతారని, అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారని ప్రభుత్వం చెబుతోంది. ఈ కారణంతోనే న్యాయస్థానాల నుంచీ ప్రతికూల ఫలితాలు వచ్చినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లో విద్యాబోధనను కొనసాగించడం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
వెనక్కి తగ్గక తప్పదా?
తాజాగా కేంద్ర కేబినెట్ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టబోతోండటంతో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. జాతీయ విద్యా విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం చేసేది కాదు.. అలాగని మినహాయింపు ఇచ్చేదీ కాదు. నూతన విద్యా విధానంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇంగ్లీష్ మీడియానికి బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు. తప్పనిసరిగా వెనకడుగు వేయాల్సిన వస్తుందనే అంటున్నారు.
Recommended Video
స్వాగతించిన చంద్రబాబు.. జగన్ ఏం చెబుతారు?
నూతన విద్యావిధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీన్ని ఆయన స్వాగతిస్తారా? లేక మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్పందన ఏమిటో తెలియజేశారు. నూతన విద్యా విధానాన్ని ఆయన స్వాగతించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గానీ ఇప్పటిదాకా ఎవరూ దీనిపై వ్యాఖ్యానించలేదు.