నవీన్ పట్నాయక్ కేబినెట్లో సగం మందికి పైగా తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలే..!
భువనేశ్వర్ : ఒడిషా ముఖ్యమంత్రిగా బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా అయిన వారిలో దేశవ్యాప్తంగా ఇద్దరే ఉన్నారు. ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కాగా మరొకరు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్. తాజాగా వీరి సరసన నవీన్ పట్నాయక్ చేరారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసిన క్షణాల్లోనే నవీన్ పట్నాయక్ గత 19 ఏళ్ల ప్రయాణంపై ట్వీట్ చేశారు.
తనకు మరోసారి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన 4.5 కోట్ల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వనని తెలిపారు.ఇక నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారోత్సవానికి 10వేల మంది హాజరయ్యారు. 40 డిగ్రీల ఎండ ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా తమ అభిమాన నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా చూడాలనే కృతనిశ్చయంతో కనిపించారు.
ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ పెద్ద సోదరుడు ప్రేమ్ పట్నాయక్, సోదరి ప్రముఖ రచయిత్రి గీతా మెహతాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ పట్నాయక్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to Shri Naveen Patnaik Ji on taking oath as Odisha’s Chief Minister. Best wishes to him and his team in fulfilling the people’s aspirations. I assure complete cooperation from the Centre in working for Odisha’s progress. @Naveen_Odisha
— Narendra Modi (@narendramodi) May 29, 2019
ఇక నవీన్ పట్నాయక్తో పాటు మరో 20 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు ఒడిషాలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయని అంచనావేశారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందంటూ లెక్కలేశారు. అయితే ఆ అంచనాలు తప్పని రుజువు చేస్తూ తిరిగి అధికారంలోకి వచ్చారు నవీన్ పట్నాయక్. బీజేడీ 112 స్థానాలతో విజయం సాధించింది. నవీన్ పట్నాయక్ కేబినెట్లో 11 మంది మంత్రులవి పాత ముఖాలే కాగా మరో 9 మంది మాత్రం కొత్త ముఖాలున్నాయి.