గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు: అక్టోబర్ నుంచి మొదలు: ప్రభుత్వంలో జోష్..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం నుండి విమాన సర్వీసులు సైతం రద్దయ్యాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ తాము విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తే..వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా విమానయానం పడిపోయిందని చెబుతూ వచ్చింది. అయితే, తాజాగా ఏపీ ప్రభుత్వానికి జోష్ ఇచ్చేలా కొత్తగా గన్నవరం నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచేందుకు విమానయాన సంస్థలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా వచ్చే నెల నుండి గన్నవరం నుండి విశాఖ..హైదరాబాద్ కు సర్వీసులు పెంచాలని నిర్ణయించాయి.
గన్నవరం నుండి కొత్తగా విమాన సర్వీసులు
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముందుకు వస్తున్న ఎయిర్లైన్స్ సంస్థలు గన్నవరం నుండి సర్వీసులు పెంచేందుకు ముందుకు వచ్చాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పెరుగుతున్న సర్వీసులు గన్నవరం నుండి కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా తొలుత విశాఖ.. హైదరాబాద్కు రెండు చొప్పున కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్లతో పాటు హైదరాబాద్కు అదనంగా రెండు సర్వీస్లను ఎయిర్లైన్స్ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్కు విమాన సర్వీస్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ముందుకువచ్చాయి. ఈ సంస్థల ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం ప్రకటించారు. కొత్తగా అందుబాటులోకి వస్తున్న సర్వీసుల వేళలను వెల్లడించారు.
విశాఖ కు సర్వీసుల టైం టేబుల్..
అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్కు సర్వీస్లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. అదే విధంగా మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్కు చేరుకుంటుందని స్పైస్జెట్ ప్రతినిధులు ప్రకటించారు.
హైదరాబాద్కు ఇండిగో నాలుగో సర్వీస్..
గన్నవరం నుండి హైదరాబాద్ కు రద్దీ ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్- విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది. ఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీకి రాత్రి సమయంలో గతంలో ఢిల్లీకి సర్వీసు నడిపేది. రద్దీ తగ్గిన కారణంగా రద్దు చేసుకుంది. ఇప్పుడు తిరిగి ప్రారంభించటం పైన త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.