పాదయాత్రలో ఖర్చులు: వాటి మాటేమిటి... జగన్కు సొంత పార్టీ వారు షాకిచ్చారు
వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర వాయిదా పడే అవకాశముందని, ఆయన జిల్లాల పర్యటనకు తొలుత వెళ్లవచ్చునని ప్రచారం సాగింది.
అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పాదయాత్ర వాయిదా పడే అవకాశముందని, ఆయన జిల్లాల పర్యటనకు తొలుత వెళ్లవచ్చునని ప్రచారం సాగింది.
అయితే, జగన్ పాదయాత్ర ఖరారైనట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 27వ తేదీకి బదులు నవంబర్ మొదటి వారంలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. జగన్ పాదయాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.
ఇడుపులపాయ టు ఇచ్చాపురం
అనంతరం ఇడుపులపాయ చేరుకొని పాదయాత్రకు శ్రీకారం చుడతారు. తొలుత కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర చేస్తారు. అనంతరం ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మీదుగా సాగి ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.
పాదయాత్రకు మరో చిక్కు
పాదయాత్ర నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో చిక్కు ఎదురైనట్లుగా చెబుతున్నారు. ఆయన నియోజకవర్గాల వారికి ఏర్పాట్ల కోసం అధిష్టానం నుంచి సూచనలు అందగా, నిధుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది.
కోర్టుకు తోడు ఇప్పుడు ఖర్చులు
ఇప్పటికే జగన్ పాదయాత్ర సమయంలోను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక పాదయాత్ర సమయంలో అయ్యే ఖర్చును జగన్ పెట్టడానికి వీలు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆస్తులు సిబిఐ, ఈడీ అటాచ్ చేసింది.
నిధులు సమీకరించాలని ఇంచార్జులకు ఆదేశం
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆయన నియోజకవర్గాల ఇంచార్జులకు పాదయాత్ర కోసం నిధులను సమీకరించాలని చెప్పిందని తెలుస్తోంది. లేదంటే నియోజకవర్గ ఇంచార్జులు చూసుకోవాలని చెప్పినట్లుగా సమాచారం.
అధిష్టానానికి షాకిచ్చిన కొందరు నేతలు
అయితే, దీనిపై పలువురు నియోజకవర్గ ఇంచార్జులు తమకు 2014 ఎన్నికలకు సంబంధించిన ఫండ్స్ రావాలని, మళ్లీ కొత్తగా పెట్టాలంటే ఇబ్బందులు అని చెప్పారని తెలుస్తోంది. 2014లో అభ్యర్థులు సొంతగా ఖర్చు పెట్టారు. కానీ చాలామందికి ఇప్పటి వరకు పార్టీ నుంచి రావాల్సిన ఫండ్స్ అందలేదని తెలుస్తోంది.