విభజన: 15 ఏళ్ల తర్వాత జార్ఖండ్ ఇలా ఉంది, మరి ఏపీ ఎలా ఉండబోతుందో?
అమరావతి: నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ బీహార్ నుంచి విభజించాలని జార్ఖండ్ ప్రజలు విడిపోయి సుమారు 15 ఏళ్లు అవుతుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎర్పడిన తర్వాత ఈ రాష్ట్ర విభజన జరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడితే భారీగా నిధులు, ప్యాకేజీలు వస్తాయని అందరూ భావించారు. అంతేకాదు పరిపాలన అంతా మన చేతుల్లోనే ఉంటుందని అనుకున్నారు.
దీటైన రాజధానిని నిర్మిస్తామంటూ రాజకీయ నాయకులు తమను మోసం చేశారంటూ జార్ఖండ్ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీ నిర్మాణానికి అప్పటి ఉప ప్రధాని ఎల్కే అద్వానీ శంకుస్థాపన చేశారు. సుమారు రెండు వేల ఎకరాల్లో మొదలు పెట్టిన ఈ రాజధాని నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలింది.
ఈ రాజధాని నిర్మాణాన్ని హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్ సంస్ధ చేపట్టింది. ఇప్పటికీ ఈ నిర్మాణం పూర్తి కాలేదు. అంతేకాదు సెక్రటేరియట్, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అద్దెభవనాల్లోనే నడుస్తున్నాయి. అంతేకాదు జార్ఖండ్ రాజధాని భూ సమస్యను కూడా ఎదుర్కొంటుంది. ఎక్కడైతే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం అనుకుందో అక్కడ ప్రజలు భూమిని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.
50 ఏళ్లుగా తామిక్కడే జీవనం సాగిస్తున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికీ రాజధాని రాంచీలో సరైన ఇంటి నిర్మాణం, ఎలక్ట్రిసిటీ సమస్య, త్రాగునీరు సమస్యలున్నాయని ప్రజలే చెబుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 స్మార్ట్ సిటీల్లో రాంచీకి చోటు లభించింది.
కనీసం ఇప్పుడైనా రాంచీ దశ మారుతుందోమో చూడాలి. రాంచీ సంగతే అలా ఉంటే, మరి అమరావతి పరిస్ధితి ఎంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండి బీహార్ను విభజించిన పదేళ్లకు మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్కు పోలిక లేదంటున్నారు.
ఎందుకంటే జార్ఖండ్, ఏపీ పరిస్థితులు పూర్తిగా విభిన్నం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని నిర్మాణం కోసం భూమినిచ్చారు. అమరావతి నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులపై ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసుకుని దేశ దేశాలు పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టుబడుల కోసం జపాన్, చైనా లాంటి దేశాల్లో పర్యటించారు. అంతేకాదు రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్, జపాన్ లాంటి దేశాల సలహాలను కూడా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో జలవనరులు పుష్కలంగా ఉన్నాయని, లాజిస్టిక్స్ రంగంలో ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే సుదీర్ఘ కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్ సొంతం.