దిగ్గజాలతో తెలుగునాట మరో కొత్త మీడియా సంస్థ సంచలనం
ఇద్దరు మీడియా దిగ్గజాలు రవి ప్రకాష్, నరేంద్రనాథ్ చౌదరి ,కొడాలి నాని కలిసి ఒక కొత్త మీడియా సంస్థ పెట్టబోతున్నారనే ఒక రూమర్ తాజాగా మీడియా వర్గాల్లో హల్ చల్ చేస్తోంది.
అమరావతి: ఔనా నిజమేనా...ఇద్దరు మీడియా దిగ్గజాలు మరో రాజకీయ నాయకుడు కలసి ఒక కొత్త మీడియా సంస్థ పెట్టబోతున్నారట...ఈ వార్తలో నిజమెంతో తెలియదు కాని మీడియా వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
కారణం ఆ మీడియా దిగ్గజాల చేతిలో ఆల్రెడీ అనేక ఛానళ్లు ఉండగా మళ్లీ మరో కొత్త ఛానెల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందబ్బా అని మీడియా వాళ్లే బుర్రలు గోక్కుంటున్నారట...ఎన్నికల సమయం దగ్గర పడుతుండటం, రెండు ఛానల్స్ ప్రముఖులతో కలసి మీడియా సంస్థ స్థాపించబోతున్నఆ మూడో వ్యక్తి వైసిపి నాయకుడు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మొత్తానికి ఏదో అతిపెద్ద స్కెచ్ సిద్దమయిందని, ఆ ప్రకారం ఈ మీడియా సంస్థ పుట్టుకొస్తోందని మిగతా మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు...ఒకరు టివి9 సిఈవో రవిప్రకాష్ కాగా, మరోకరు ఎన్ టివి అధినేత నరేంద్రనాథ్ చౌదరి అయితే ఆ మూడో వ్యక్తి రాజకీయ నేత కొడాలి నాని అని అంటున్నారు. వీరు ముగ్గురు కలసి ఎలెవన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఒక కంపెనీని రిజిస్టర్ చేసారని పుకార్లు గుప్పుమంటున్నాయి. న్యూస్ ఛానళ్ల పరంగా టీవీ 9.. ఎన్ టీవీలు పోటాపోటీగా ఉంటాయి.వారం వారం రేటింగ్ లో తమ ప్రత్యర్థుల్నిఅధిగమించేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తుంటాయి. అలాంటి రెండు పోటాపోటీ న్యూస్ ఛానల్స్ కు చెందిన ప్రముఖులు కలిసి మరో కొత్త మీడియా సంస్థ స్థాపిస్తున్నారంటే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది మరి.
ఈ ముగ్గురు ప్రముఖులు కలసి తాము పెట్టబోయే సంస్థకు ఎలెవన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ గా నామకరణం చెయ్యడమే కాదు ఆల్రెడీ రిజిష్టర్ కూడా చేసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 92లో దీనికోసం ఆఫీసు కూడా తీసుకున్నారని అంటున్నారు. అలాగే త్వరలోనే మరో ఎంపి కూడా ఈ మీడియా సంస్థలో భాగస్వామి కానున్నారట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే అసలు ఈ సంస్థ పెట్టటం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందన్నదే మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంత మంది మీడియా ప్రముఖుల విశ్లేషణ ప్రకారం ఈ ముగ్గురూ త్వరలో ఒక కొత్త తెలుగు న్యూస్ ఛానెల్ తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నారని, ఆ ఛానల్ 2019 ఎన్నికల సమయానికి అందుబాటులోకి తెస్తే వీరి బ్యాక్ గ్రౌండ్ దృష్ట్యా ఖచ్చితంగా విజయవంతం చేసి మరో సక్సెస్ ఫుల్ మీడియాను తమ ఖాతాలో వేసుకోవచ్చనేది వీరి ఐడియా అని అంటున్నారు.
అయితే కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సమయంలో టీవీ9 రవిప్రకాష్, ఎన్టీవీ చౌదరి పక్కపక్కన కూర్చొని పవన్ తో చర్చించిన సందర్భంలో కూడా వీరు ముగ్గురు కలసి ఛానెల్ పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. పైగా అదే ఫంక్షన్లో పవన్ మైక్ అందుకున్న వెంటనే అతడి నోటి నుంచి వెలువడిన మొదటి మాటలు రవిప్రకాష్ , నరేంద్రనాధ్ చౌదరిల గురించే...ఆ ప్రాజెక్ట్ సంగతేమో గాని ఇప్పుడు వినిపిస్తున్న టాక్ మాత్రం ద్వితీయ శ్రేణి మీడియా వ్యక్తులు నమ్మకంగా చెబుతున్నారు. అదే నిజమైన పక్షంలో మీడియా ద్వారా లాభాలు గడించడం తెలిసిన మీడియా దిగ్గజాల నేతృత్వం ప్లస్ రాజకీయ నాయకుల అండదండలు వెరసి తెలుగు వార్తాలోకంలో మరో సంచలనం చోటు చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.