Amaravati గ్రామాల సంఖ్య కుదింపు: 29 కాదిక..: కొత్త మున్సిపాలిటీ: నగర పంచాయతీలు తెరపైకి
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఏడాదికి పైగా తమ ఆందోళనలు, దీక్షలను కొనసాగిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని ప్రాంత గ్రామాల సంఖ్యను కుదించింది. అమరావతి పరిధిలో అయిదు గ్రామాలను వార్డులుగా మార్చివేసింది. వాటిని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చింది. మున్సిపాలిటీల పరిధిలోకి చేరడంతో అవి వార్డులుగా మారాయి. అలాగే- ఒక కొత్త మున్సిపాలిటీ, మరో అయిదు నగర పంచాయతీలను ఏర్పాటు చేసింది.
Recommended Video
మంగళగిరి-తాడేపల్లి మున్సిపాలిటీలో కలిసిన గ్రామాలివే..
అమరావతి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు, బేతపూడి గ్రామాలు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రులను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం కాగా.. ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తాడేపల్లి పరిధిలోకి తీసుకొచ్చింది. ఫలితంగా ఇప్పటిదాకా అమరావతి పరిధిలో కొనసాగిన గ్రామాల సంఖ్య 29 కాగా.. తాజాగా వాటి సంఖ్య 23కు పడిపోయింది. ఆయా పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటినీ మున్సిపాలిటీల పరిధిలోకి తీసుకొచ్చినట్టయింది.
తాడిగడపకు మున్సిపాలిటీ హోదా.. వైఎస్సార్ పేరు
విజయవాడ శివార్లలోని తాడిగడప.. కొత్త మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప ప్రాంతాలను దీని పరిధిలోకి చేర్చారు. దానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. వైఎస్సార్ తాడిగడపగా నామకరణం చేశారు. దీనితోపాటు- పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, విజయనగరం జిల్లాలోని రాజాం, చిత్తూరు జిల్లా బీ.కొత్తకోట, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా పొదిలిలను నగర పంచాయతీలుగా గుర్తించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
మున్సిపాలిటీల పరిధి మరింత పెంపు..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్లలో మరిన్ని గ్రామాలను చేర్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లి గూడెం, భీమవరం, తణుకు, గుంటూరు జిల్లాలోని బాపట్ల, పొన్నూరు, ప్రకాశం జిల్లా కందూకూరు, నెల్లూరు జిల్లా కావలి, గూడురు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీల పరిధిని మరింత విస్తృతం చేసింది. ఆయా మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న గ్రామాలను వాటిల్లో విలీనం చేసింది. మంగళగిరి, తాడేపల్లి తరహాలోనే వాటి పరిధిని పెంచింది.