కిరణ్తో కలిసి పార్టీ: రాయపాటి, రేసులో లేను: కాసు
గుంటూరు/ నెల్లూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యులు కలిసి పార్టీ పెడుతున్నట్లు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చెప్పారు. ఆ ఆరుగురు ఎంపీల్లో రాయపాటి కూడా ఉన్నారు. గుంటూరులో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నించామని, విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ దౌర్జన్యంగా వ్యవహరించిందని రాయపాటి అన్నారు.
తాను ముఖ్యమంత్రి రేసులో లేనంటూ కాంగ్రెస్ మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో గురువారం ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి సీఎం పదవి కొత్త కాదని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలలో కింగ్ మేకర్లా ఉండాలను కుంటున్నానని ఆయన చెప్పారు.
ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం తనను సీఎంగా ఉండాలని కోరితే ఆలోచిస్తానని ఆయన అన్నారు తాను ఇప్పటికీ సమైక్యవాదినేనని, అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచానని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్ధితులలోనూ కాంగ్రెస్ పార్టీను విడిచి వెళ్ళనని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓడిపోలేదని, నష్టపోయారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. నెల్లూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కుమ్మక్కయి సీమాంధ్ర ప్రజలను మోసం చేశాయని ఆయన విమర్శించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
సీమాంధ్రకు న్యాయం చేసే నేతలను వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని, అయితే పక్షపాతం లేకుండా సమైక్యాంధ్ర కోసం పనిచేసిన నేతలు ఎన్నిక కావడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన చెప్పారు.