ఇంత ఉత్కంఠ పరిస్థితుల మద్య కొత్త పార్టీనా..? పరివర్తనమా..? పరిహాసమా..?
అవశేష ఆంద్ర ప్రదేశ్.. క్షేత్రస్థాయి నుండి అభివ్రుద్ది.. రాజకీయ పట్టుకోసం పోటీలు.. ఆదిపత్యం కోసం ఎత్తులు, లోటు బడ్జెట్, మౌళిక సదుపాయాలు నిల్.. కేంద్ర సాయం జీరో.. రెక్కల కష్టంతో ఎదుగుదల.. ఒక పార్టీని తొక్కాలని మరో పార్టీ యుక్తులు.. కుయుక్తులు. రాజకీయ మనుగడకోసం శ్రుతిమించిన ఆరోపణలు.. వాటికి ప్రత్యారోపణలు.. పార్టీ ఫిరాయింపులు, అదికార కోల్పోవడం.. అందలం ఎక్కడం.. అప్పటి వరకు స్నేహితులు.. మరుక్షణం బద్ద శత్రువులు.. విభజించిన పార్టీపై ప్రజల్లో కసి, విభజన హామీలు నెరవేర్చని పార్టీపై ప్రతీకారం.. ప్రతిపక్ష పార్టీ పైన కలగని విశ్వసనీయత.. ఈ పరిణామాలన్నీ ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఉన్న పార్టీలకే సరైన ఆదరణ కరువౌతున్న ప్రస్తుత తరుణంలో మరో కొత్త పార్టీ ఉద్బవిస్తోంది. అరకు వైసీపి ఎంపీ కొత్తపల్లి గీత కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. ఆంద్రప్రేదేశ్ లో కొత్త రాజకీయ పార్టీకి జొరబడే శూన్యత ఉందా అనే అంశం పై చర్చ జరుగుతోంది. మరి కొత్తపల్లి గీత కొత్త పార్టీ మనుగడ ఎలా ఉండబోతోంది..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఏపి.. మరో కొత్త పార్టీ ఆవిర్బావం..
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార పార్టీతో సహా మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నాయి. ఇందుకోసం ప్రతి పార్టీ స్పీడు పెంచేశాయి. ఒకవైపు ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాయి. పార్టీలు చేసే హడావిడితో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దీంతో ఏపీలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే నడిచింది. బీజేపీ, జనసేన కూడా టీడీపీతోనే కలిసి నడిచాయి. ఇక కాంగ్రెస్, విభజన ఎఫెక్ట్తో ఏపీలో అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
విభజనతో కుదేలైన పార్టీలు.. మరో కొత్త పార్టీని ప్రజలు స్వాగతిస్తారా..?
ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, జనసేనలు టీడీపీకి వ్యతిరేకమై వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పాత నాయకులని కలుపుకొని పోతూ కొత్త ఉత్సాహంతో వచ్చే ఎన్నికలవైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పార్టీలు ఎన్ని ఉన్నా ఈ సారి కూడా టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, జనసేన కూడా టీడిపి, వైసీసిలకు ప్రత్యామ్నాయంగా ఆవిర్బవించింది. జనసేన ప్రభావం 2019 ఎన్నికల్లో తప్పకు ఉంటుందనే చర్చ జరుగుతోంది.
కొత్తపల్లి గీత కొత్త పార్టీ మనుగడ సాదిస్తుందా..! పార్టీ ఆవశ్యకత ఎందుకు..?
ఇంత హడావిడి మధ్య రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈనెల 24న పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో గీత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మహిళలకు గౌరవం దక్కడంలేదని చెప్పారు.
పార్టీ స్థాపించి, ప్రజలను మెప్పించి, నెట్టుకు రాగలిగే సత్తా కొత్తపల్లి గీతలో ఉందా..?
అంతేకాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అని, పాదయాత్ర చేసినంత మాత్రాన ఆయన సీఎం కాలేరని చెప్పారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్నట్లు జగన్ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆ మధ్య ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల కోసం పలు పోరాటాలు చేస్తున్నారు గీత. ఆమె వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ, బీజేపీలో చేరబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ఏ పార్టీలో చేరకపోగా, కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.