ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు.. తొలగించిన జాబితాపై సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీలో రేషన్ కార్డుకు మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్డులకు లింక్ లేకుండా ఏ పథకానికి ఆ పథకానికే కార్డులు మంజూరు చేస్తుంది ఏపీ సర్కార్ . రాష్ట్రంలో పింఛను పొందే లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి పంపిణీ చేయనుంది. దీంతో పాటు ఇప్పటికే ఏపీలో పించన్ తొలగించారని ఆందోళన నెలకొన్న నేపధ్యంలో మరోసారి లబ్దిదారుల విషయంలో రీ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీలో పెన్షన్ల తొలగింపుకు నిరసనగా టీడీపీ పోరు: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
నేటి నుండి ఏపీలో పెన్షన్ కు సంబంధించి కొత్త కార్డుల పంపిణీ
ఏపీలో నిరుపేదలైన వారికి అందించే వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది . ఇక లబ్దిదారులందరికీ నేటి నుండి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వాలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రకటించింది . సెర్ఫ్ సీఈవో రాజాబాబు ఇక ఈ విషయాన్ని చెప్పటమే కాకుండా ఇటీవల పెన్షన్లు తొలగించిన వారి విషయంలో కూడా ప్రభుత్వం రీ సర్వే చేస్తుందని వివరించారు . గతంలో పెన్షన్ బుక్, గుర్తింపు కార్డుల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే కోడా గ్రామ వాలంటీర్లను సంప్రదించాలని చెబుతున్నారు.
లబ్దిదారులందరికీ పెన్షన్ బుక్తో పాటు ఐడెంటిటి కార్డు
ఇటీవలే కొత్త రేషన్ కార్డులు పంపిణీని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ పెన్షన్ పొందే లబ్దిదారులకు కూడా కొత్త పెన్షన్ కార్డులను పంపిణీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ఈ నెలలో కొత్తగా పెన్షన్కు అనుమతి లభించినవారికి పెన్షన్ బుక్తో పాటు ఐడెంటిటి కార్డు కూడా ఇవ్వనున్నట్టు అధికారులు చెప్తున్నారు . పాత పెన్షన్దారులందరికి గతంలోనే పెన్షన్ పుస్తకాలు అందజేసిన నేపథ్యంలో వారికి గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది .
పెన్షన్ తొలగింపు జాబితా విషయంలో సీఎం జగన్ రివ్యూ మీటింగ్
ఇటీవల సీఎం జగన్ ఏపీలో పెన్షన్ లబ్దిదారుల విషయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు . ఇక ఈ రివ్యూ మీటింగ్ లో చాలామంది పెన్షన్లు తీసివేశారని వస్తున్న వార్తలపై సీఎం జగన్ కీలక మార్గనిర్దేశకాలు విడుదల చేశారు. ఇక వీరి విషయంలో మరోసారి రీ సర్వే జరిపి, అర్హులైన వారిని తొలిగించినట్లయితే వారిని తిరిగి జాబితాలో చేర్చి వారికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక వారికి వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కలిపి ఇవ్వాలని సీఎం జగన్ పేర్కొన్నారు .
Recommended Video
రీ సర్వే చేసి అర్హులు ఉంటె జాబితాలో చేర్చాలన్న సీఎం .. రీ సర్వే చేస్తున్న అధికారులు
సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీలో దీనికి సంబంధించిన రీ సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. చాలా మంది నిరుపేదలైన వారు తమకు పెన్షన్ తొలగించారని ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో రీ సర్వే ద్వారా పునః పరిశీలించి వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా ఇందులో ఎంతమందికి లబ్ది జరుగుతుందో తెలియాల్సి ఉంది . ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసింది.