ఏపీలో మారుతున్న రాజకీయం..! తప్పని చతుర్ముఖ పోటీ...!!
హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ రాజకీయలు రోజుకోమలుపు తీసుకుంటున్నాయి. పొత్తులు, పొత్తులు లేకుండా వంటి అంశాలతో రోజుకో రంగు పులుముకుంటున్నాయి. నిన్నటి వరకు అదికార టీడిపి ప్రతిపక్ష వైసీపి మద్య రసవత్తర పోరు ఉంటుందని భావించినప్పటికి మారిన రాజకీయ నేపథ్యంలో నాలుగు పార్టీలు తీవ్ర స్థాయిలో తలపడనున్నాయి. ఏపీలో ఇప్పుడు చతుర్ముఖ పోటీ ఏ పార్టీకి లాభం చేకూర్చుతుంది, ఎవరిని ముంచుతుంది అన్న చర్చ సాగుతోంది. బీజెపీ, వైసీపి పార్టీలు స్వతంత్ర్యంగా తెరపైకి రావడం ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ అంచనాలను తలకిందలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో నువ్వా, నేనే అని పోటీపడ్డ టీడీపీ, వైసీపీలకు ఈ పరిస్థితులు కొంత సంకటంగా మారాయి.
ఏపిలో అప్పుడు రెండు పార్టీల మద్య పోరు..! ఇప్పుడు నాలుగు పార్టీల మద్య పోటీ..!!
కొంతకాలం క్రితం వరకూ ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యే పోరు అన్నట్లుగా సాగిన రాజకీయ వాతావరణం తారుమారైంది. దీంతో చతుర్ముఖ పోరు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీతో టీడీపీ దూరమైన నేపథ్యంలో వైసీపీ ఇంతవరకు ఏ పార్టీకి దగ్గరవలేక పోవడం నేపథ్యంలో వామపక్షాలను కలుపుకొని జనసేన తెరపైకి రావడం, తప్పని పరిస్థితుల్లో బీజేపీ ఒంటరి బాట పట్టడం వంటి పరిణామాలు మున్ముందు ఏపీలో చతుర్ముఖ పోరుకు బాటలు వేస్తున్నాయా అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదిలావుంటే ఎన్నికల అనంతరం బీజేపీతో వైసీపీ జతకట్టే అవకాశముందన్న ప్రచారమూ ఉంది. అదే సందర్భంలో టీడీపీ, కాంగ్రెస్ రెండూ చేతులు కలుపుతాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అదే సందర్భంలో జనసేన, వామపక్షాలు సైతం కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో అంతే దూరాన్ని పాటిస్తున్నాయి.
జనసేన, బీజేపీ స్వతంత్ర్యంగా పోటీ..! టీడిపీకి లాభమా..? వైసీపీపీకా..?
దీంతో రాజకీయాలను మొత్తం ప్రభావితం చేయకపోయినా తన హస్తవాసిని ప్రదర్శించేందుకు కాంగ్రెస్, వామపక్షాలతో కలసి విజృంభించేందుకు జనసేన రెఢీ అవుతున్నాయి. అయితే ఈ పార్టీల ప్రభావంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. అంతే కాకుండా ఇవే సమీకరణాలు ప్రధాన పార్టీల తలరాతలను మార్చగలవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మారుతున్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది అన్నది వాస్తవం. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రత్యేక హోదా కల కాంగ్రెస్ సాకారం చేస్తే చంద్రబాబుకు అనుకూలమే..!!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం సెంటిమెంటుగా మారుతున్న నేపథ్యంలో దాని సాధన కోసం కాంగ్రెస్తో కలుస్తున్నా అని టీడీపీ నాయకత్వం ప్రకటిస్తే వచ్చే నష్టం తక్కువేనని చంద్రబాబు భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముమ్మాటికీ చంద్రబాబుకు కాస్త కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
వైసీపి కి మళ్లీ ఎదురీత తప్పదా..? ఎవరితో కలిసి వెళ్తుందో స్పష్టత లేదు..!!
ఇక వైసీపీ విషయానికి వస్తే ఎన్నికల అనంతరం కమలంతో ఆ పార్టీ దోస్తీ కట్టే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అదే సందర్భంలో ఎనిమిది నెలల కిందట వరకు జనసేనతో పొత్తు కట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు సాగించింది. కానీ ఆ ప్రయత్నం కొన్ని షరత్తుల కారణంగా బెడసికొట్టిందని, అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలసి పోటీచేసేందుకు సిద్దపడ్డారని ఆ పార్టీలోని ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఏపీలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా లేదు. కేంద్రంలో మళ్లీ బీజేపీకి అనుకూల మెజార్టీ వస్తే పరిణామలు మళ్లీ ఏపీలో అనుకూలంగా మారుతాయన్నది కమలం నేతల ఆలోచనగా కనిపిస్తోంది. చివరికి ఈ చతుర్ముఖ పోటీలో ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీలలో ఎవరికి లాభం చేకూర్చుతుంది..? ఎవరికి నష్టం కలుగజేస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.