టార్గెట్ 2019: ఆ పార్టీలతోనే పవన్, కొత్త రాజకీయ ఫ్రంట్
అమరావతి: రానున్న ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, జనసేనలతో కలిసి కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్టు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కొత్త రాజకీయ వేదిక రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టిడిపి,బిజెపి కూటమికి జనసేన మద్దతిచ్చింది.
Recommended Video
సిపిఎం మాత్రం జై సమైక్యాంధ్రపార్టీతో పొత్తు పెట్టుకొంది. నాలుగేళ్ళలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో వామపక్షపార్టీలతో జనసేన పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకొంది.
ఏపీలో కొత్త రాజకీయ వేదిక
వామపక్షాలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పయనించనున్నారు. ఇటీవల కాలంలలో పవన్ కళ్యాణ్ వామపక్షపార్టీల నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో సిపిఐ, సిపిఎం,జనసేనలు కూటమిగా ఏర్పడి 2019 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసే అవకాశం ఉంది. కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు.
అనంతపురంలోనే తొలి సభ
అనంతపురంలోనే కొత్త రాజకీయ వేదికకు సంబంధించిన తొలి సభను ఏర్పాటు చేయనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఇదే జిల్లా నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దరిమిలా తొలి సభను కూడ ఇదే జిల్లా నుండి ప్రారంభించాలని తలపెట్టారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
ఏప్రిల్ 5న బ్లాక్డే నిర్వహిస్తాం
ఏప్రిల్ 5న కేంద్రం ఏపీకి అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించకపోతే ఏపీలో బ్లాక్ డే నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల ముగింపును పురస్కరించుకొని ఏపీ రాష్ట్ర ప్రజల డిమాండ్పై కేంద్రం స్పందించే అవకాశం ఉందనే ఆశతో ప్రజలున్నారు. అయితే ఏప్రిల్ 5న కేంద్రం స్పందించకుంటే బ్లాక్ డే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వనిస్తాం
తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని చూపితే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వనిస్తామని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు వ్యతిరేకంగా ఈ కొత్త రాజకీయవేదికలో ప్రముఖులను కలుపుకుపోవాలని భావిస్తున్నారు.