రాజధాని లేని ఏపీ: అన్ని తాత్కాలికం కావడం వల్లే: కొత్త పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసిన కేంద్రం..!
Recommended Video
అమరావతి: రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన ఏపీకి కనీసం రాజధాని కూడా లేదు. విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఏకంగా 33 వేల ఎకరాలను సమీకరించినప్పటికీ.. రాజధానిని నిర్మించలేెకపోయిందనడానికి తాజా ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్ ను రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సరి కొత్త పొలిటికల్ మ్యాప్ లో ఈ విషయం ప్రస్ఫూటించింది. అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులను ఈ మ్యాప్ లో గుర్తించినప్పటికీ.. ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏపీ మ్యాప్ లో రాజధాని పేరును గానీ, ప్రాంతాన్ని గానీ గుర్తించలేదు. ఫలితంగా- పిన్ కోడ్ కూడా లేకుండాపోయింది.
కొత్త మ్యాప్ లో..
కేంద్ర ప్రభుత్వం శనివారం సరికొత్త పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ఈ మ్యాప్ విడుదలైంది. జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలను వేర్వేరుగా గుర్తించింది. జమ్మూ కాశ్మీర్, లడక్ సహా దేశంలోని 29 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాలను వాటి రాజధానులతో సహా గుర్తించింది.. ఒక్క ఏపీ మినహా. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మ్యాపుల్లో వాటి రాజధాని నగరం పేరును పొందుపరిచింది. ఆ రాజధాని నగరం ఉన్న ప్రాంతాన్ని గుర్తించింది. ఏపీ మ్యాప్ లో అలాంటివేమీ లేవు. ఏపీ మ్యాప్ లో రాష్ట్రం పేరును మాత్రమే ప్రచురించింది.
33 వేల ఎకరాలను సమీకరించినప్పటికీ..
2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత.. 13 జిల్లాలతో ఏపీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజధాని నగరమంటూ ఏదీ లేకపోవడం వల్ల విజయవాడ-గుంటూరు మధ్య మంగళగిరి పరిసరాల్లో రాజధానిని నిర్మిస్తామని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికోసం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ)ను ఏర్పాటు చేశారు. రాజధాని నగర నిర్మాణానికి ఏకంగా 33 వేల ఎకరాలను సమీకరించారు. రాజధాని ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టారు.
ఆకృతుల పరిశీలనకే అయిదేళ్లా?
సింగపూర్ తరహా రాజధాని నగరాన్ని నిర్మిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాను 33 వేల ఎకరాలను సమీకరించినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు గానీ దాన్ని కార్యాచరణలోకి పెట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. రాజధాని భవన నిర్మాణాల ఆకృతులను పరిశీలించడానికే అయిదేళ్ల కాలాన్ని వృధా చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలికంగా సచివాలయాన్ని నిర్మించారు. హైకోర్టు నిర్మాణం కూడా తాత్కాలికమే. అయిదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడి హయాంలో రాజధాని ప్రాంతంలో చోటు చేసుకున్న నిర్మాణాలు ఈ రెండేనంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది.
తాత్కాలిక నిర్మాణాలు కావడం వల్లే..
రాజధాని ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ.. సచివాలయాన్ని, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చినప్పటికీ.. కేంద్రం వాటిని గుర్తించలేదు. దీనికి ఉన్న ఏకైక కారణం- ఈ రెండూ తాత్కాలిక కట్టడాలే. వెలగపూడిలో నిర్మించిన సచివాలయం, హైకోర్టు భవనం రెండూ తాత్కాలికమేననే విషయాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీని ఫలితంగా- రాష్ట్ర రాజధాని ఏదనే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టతా లేదు. అలాగని విజయవాడను రాజధానిగా గుర్తించలేదు.
అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధాని హాజరైనప్పటికీ..
అమరావతి నగర నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వం.. ఓ సారి భూమి పూజ, మరోసారి శంకుస్థాపన పేరుతో. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆర్భాటంగా చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్వయంగా దీనికి హాజరయ్యారు. దేశంలోని నదులన్నింటి నుంచీ సేకరించిన పవిత్ర జలాలను అమరావతి ప్రాంతంలో చిలకరించింది నాటి ప్రభుత్వం. ఇంతా చేసినప్పటికీ.. అమరావతి నిర్మాణ పనులు మాత్రం ఆరంభం కాలేదు. అమరావతి నిర్మాణానికి శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం ఈ తరువాతి కాలంలో నిర్మానుష్యంగా మారింది.
చంద్రబాబు అడుగు జాడల్లోనే వైఎస్ జగన్ కూడా..
మొన్నటి ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా అమరావతి నిర్మాణంలో ఎలాంటి స్పష్టతా లేదనే విమర్శలు ఉన్నాయి. రాజధానిని అదే ప్రాంతంలో కొనసాగిస్తారా? లేక దొనకొండ లేదా ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల తరువాత కూడా రాజధాని నిర్మాణంపై వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రెండు దఫాలుగా నిధులను మాత్రం విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు సైతం స్తంభించిపోయాయి. ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.