హోదా కాదు..స్పెషల్ ఫోకస్ స్టేట్: జగన్ ఒప్పుకోవాల్సిందేనా: చంద్రబాబు చేతికి అస్త్రం అందిస్తారా
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్షాను కలిసి హోదా కోసం ప్రధానిని ఒప్పించాలని కోరారు. నీతి అయోగ్ సమావేశంలోనూ ప్రస్తావిస్తున్నారు. ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హోదా పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. స్పెషల్ కేటగిరి స్టేటస్ కాకుండా..స్పెషల్ ఫోకస్ స్టేట్ పేరుతో కేంద్ర సాయం గురించి చర్చిస్తున్నారు. మరి..దీనికి జగన్ సైతం ఒప్పుకోవాలా..సాధ్యమేనా..
హోదా కోసం జగన్ ఫీట్లు..
ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న నాటి నుండి జగన్ ఏపీకీ ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేసారు. నాటి సీఎం చంద్రబాబు కారణంగానే ఏపీకి హోదా రాలేదని ఆరోపణలు చేసారు. రాజకీయంగానూ పైచేయి సాధించారు. చివరకు అధికారంలోకి వచ్చారు. అయితే, కేంద్రంలో పూర్తి మెజార్టీతో మోదీ అధికారంలోకి వచ్చారు. ఎవరి సాయం లేకుండానే పాలన చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీకీ హోదా సాధించటం జగన్కు కష్ట సాధ్యంగా మారుతోంది. దీంతో..వారితో విభేదించటం కంటే సఖ్యతగా ఉంటూనే హోదా సాధించాలని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా.. తొలి సారి మోదీతో సమావేశమైన సమయంలోనే హోదా గురించి అభ్యర్దించారు. తాజా పర్యటనలో అమిత్ షాకు మోదీతో ఒక మాట చెప్పాలంటూ కోరారు. నీతి అయోగ్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినా..ప్రధాని మోదీ మాత్రం హోదా పైన ఎటువంటి సానుకూలత వ్యక్తం చేయటం లేదు.
కొత్తగా స్పెషల్ ఫోకస్ స్టేట్ ప్రతిపాదన..
ఇక ఎవరికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం చెబుతున్న సమయంలో కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. స్పెషల్ స్టేటస్ స్థానంలో స్పెషల్ ఫోకస్ స్టేట్గా పరిగణించి..కేంద్రం సాయాం చేయాలనేది ఈ ప్రతిపాదన సారాంశం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోదీతో సమావేశ సమయంలో ఈ ప్రతిపాదన చేసారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒడిశా..ఏపీ..తమిళనాడు లాంటి తీర ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు భారీగా నష్ట పోతున్నాయని..అదే సమయంలో పారిశ్రామికంగా అభివృద్దికి దూరమవుతున్నాయని వివరించారు. దీని కోసం సాంకేతికంగా హోదా సాధ్యం కాని సమయంలో ఆర్దికంగా నష్టపోతున్న తమ ప్రాంతాలకు కేంద్రం స్పెషల్ ఫోకస్ స్టేట్ పేరుతో సాయం చేయాలని కోరుతున్నారు. ఈ కేటిగిరీలో ఏపీ సైతం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న నీతి అయోగ్ సమావేశంలో ఈ ప్రతిపాదన మీద చర్చ జరిగే అవకాశం ఉంది.
జగన్ అంగీకరిస్తారా..బాబు చేతికి అస్త్రంగా
ఇప్పుడు తాజాగా తెర మీదకు వచ్చిన స్పెషల్ ఫోకస్ స్టేట్ ప్రతిపాదనకు ఏపీ ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారా అంటే సీఎం సన్నిహితులు మాత్రం లేదనే చెబుతున్నారు. గతంలో హోదాకు మించిన ప్యాకేజి ఇస్తామని చెబితే నాడు చంద్రబాబు అంగీరిచంటం పైన విపక్ష నేతగా జగన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు హోదా కాకుండా మేర ప్రతిపాదన పైనా అంగీకారం తెలిపినా..ఖచ్చితంగా అది రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉంది. దీనినే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అవకాశంగా మలచుకోవటానికి సిద్దంగా ఉంటారు. కేంద్రాన్ని ఒప్పించి హోదా తీసుకురాలేకపోతే..ఏపీలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులు మరోసారి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు జగన్ హోదా అంశంలో ఏం చేస్తారు..కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.