కొత్త రేషన్ కార్డులు ఇక ఇంటికే..! కసరత్తు చేస్తున్న ఏపి సర్కార్..!!
అమరావతి/హైదరాబాద్ : పౌర సరఫరా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చేందుకు ఏపి సర్కార్ నడుం బిగిస్తోంది. మెరుగైన పాలనతోపాటు చురుకైన ప్రజా పంపిణీ వ్యవస్థ ఉండాలని, అందుకోసం మార్గదర్శకాలను రూపొందింస్తోంది ఏపి సర్కార్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. ఈ కార్డులను నేరుగా ప్రజల ఇంటికే చేరవేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. 2019, సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులు వస్తాయని..
అప్పటి వరకు పాత రేషన్ కార్డులు చెల్లుతాయని.. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అంతవరకూపాత రేషన్ కార్డులు చెల్లుతాయని దీనిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఆయన చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని వివరాలు అందులో ఉంటాయని.. రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అన్ని వివరాలతో లబ్ధిదారునికి అవగాహన కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ పంపిణీ కూడా ప్యాకేజింగ్ రూపంలో ఉంటుందన్నారు.
ఇలాంటి వ్యవస్థ వల్ల కల్తీకి అవకాశం ఉండదన్నారు. తూకాల్లో మోసాలను అరికట్టవచ్చన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పనులు మొదలు పెట్టామని.. గ్రామ వాలంటీర్ల నియామకం పూర్తయిన తర్వాత.. లబ్దిదారులకు ఇంటింటికీ వచ్చి ఇస్తారన్నారు. అప్పటివరకు పాత విధానమే కొనసాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వివరించారు.
టీడీపీ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం, అశ్రద్ధను అసెంబ్లీలో ప్రస్తావించారు మంత్రి. 4 వేల 800 కోట్ల రూపాయల నిధులను మళ్లించారన్నారు. దీని వల్లే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 2018 లో వెయ్యి కోట్ల రూపాయలు సివిల్ సప్లయ్స్ శాఖ చెల్లించలేదని.. ఆ బాకీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. సివిల్ సప్లై శాఖలో అవకతవకల్ని సరిదిద్ది పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.