లొంగారు: తెలంగాణ ఉద్యోగ జేఏసీ, ఆప్షన్స్పై అల్టిమేటం
హైదరాబాద్: తన స్థానికతను నిర్ణయించేది ఆంధ్ర సచివాలయమా? తాము అక్కడకు వెళ్లి ఇబ్బందులు చెప్పుకోవాలా? అంటూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ శనివారం మండిపడ్డారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకూ ఉద్యోగుల కేటాయింపునకు మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో కమలనాథన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తలొగ్గిందని వారు ఆరోపించారు. ఆ మార్గదర్శకాలు ఏపీ మార్గదర్శకాల్లా ఉన్నాయని మండిపడ్డారు.
కమలనాథన్ కమిటీ తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామన్నారు. మార్గదర్శకాల జారీ అనంతరం జరగాల్సిన ఉద్యోగుల విభజన ప్రక్రియను నిర్వహించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించడాన్ని తాముఖండిస్తున్నామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖ అధికారుల వల్లే పలు సమస్యలు తలెత్తాయని చెప్పారు. జేఏసీ నేతలు దేవీప్రసాదరావు, విఠల్ తదితరులు విలేకరులతో మాట్లాడారు.
మార్గదర్శకాల జారీ అనంతర ప్రక్రియను నిర్వహించడానికి తెలంగాణ సభ్య కార్యదర్శి/నోడల్ ఏజెన్సీతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యోగులు తమ అభిప్రాయాలను, వాదనలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని, ఈ ప్రక్రియంతా ఓ ప్రత్యేక కార్యాలయంలోనే జరగాలని వారు డిమాండ్ చేశారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం లేకపోతే తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల విభజన కింది స్థాయి నుంచి కూడా జరగాల్సిందేనన్నారు. జోనల్, జిల్లా స్థాయుల్లో కూడా ఆంధ్రా అధికారులున్నారని చెప్పారు. ఆయా కేటగిరీల్లో 20 శాతం, 30 శాతం, 40 శాతాల మేరకు ఓపెన్ కేటగిరీల్లో వచ్చిన ఇతర ప్రాంతాల ఉద్యోగుల నియామకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని తాము డిమాండ్ చేస్తున్నా.. జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులకు సంబంధించి ఆ ప్రక్రియ చోటుచేసుకోలేదని మండిపడ్డారు.
జిల్లా స్థాయిలో పోస్టులు ఖాళీ అయితే తప్ప తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు రావని స్పష్టం చేశారు. విభజన ప్రక్రియంతా అక్టోబర్ 31వ తేదీనాటికి పూర్తి కావాలని తేల్చి చెప్పారు. కమలనాథన్ కమిటీ సిఫారసుల్లోని 18 ఎఫ్ క్లాజ్ దుర్మార్గమన్నారు.దీంతో వేల సంఖ్యలో ఆంధ్రా అధికారులు తెలంగాణలోనే తిష్ట వేస్తారన్నారు. భార్యాభర్తలు ఇరువురూ ఉద్యోగులే అయితే వారి ఆప్షన్ మేరకు కేటాయింపులుంటాయని కమిటీ చెప్పిందని, అయితే, దంపతుల్లో ఒకరు తెలంగాణకు చెందిన వారైతేనే తెలంగాణలో పని చేసేందుకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు.
అప్పట్లో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చారని, ఆ ప్రహసనంపై విచారణకు ఉద్యోగ ప్రతినిధులతో కూడిన ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల మనోభావాలను కేంద్రానికి యథాతథంగా చెప్పినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలకు కృతఙ్ఞతలు చెబుతున్నామన్నారు. అందువల్లే, గతంలో కమలనాథన్ కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల్లోని లోపాలను కొంతమేరకు సవరించుకోగలిగామని చెప్పారు.
తెలంగాణ ఉద్యోగుల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు జరగకపోతే పోరాడేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకు ఆగస్ట్ 2న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం కానుంది. నాలుగో తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్లను జేఏసీ నేతలు కలిసి మార్గదర్శకాల్లో లోపాలపై ఫిర్యాదు చేస్తారు.