నేటి నుండి ఏపీలో నూతన ఇసుక విధానం .. ఇక నిర్మాణ రంగ కార్మికుల సమస్య తీరినట్టేనా!!
Recommended Video
గత మూడు నెలలుగా ఇసుక లేక నిర్మాణరంగం కుదేలైన విషయం అందరికీ తెలిసిందే. ఇక నేటి నుండి ఏపీలో నూతన ఇసుక విధానం అమలు కానున్న నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులకు ఒకింత ఊరట లభించింది. గత మూడు నెలలుగా పనుల్లేక, నానా ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాణరంగ కార్మికులు కొత్త ఇసుక విధానంతో ఇసుక అందుబాటులోకి రావడంతో తమ దైనందిన వృత్తిని కొనసాగించనున్నారు.
పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన సాధినేని యామిని ..రాజకీయ అజ్ఞాతంలో అందుకే ఉన్నానని వ్యాఖ్య
ఇసుక కొరతతో కుదేలైన నిర్మాణ రంగం .. నేటి నుండి ఇసుక అందుబాటులోకి
పాత ఇసుక విధానంలో అవినీతికి ఆస్కారం ఉందని, అక్రమాలకు అవకాశం ఉందని భావించి పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి, కొత్త ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించిన జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రజలు ఇసుక కోసం తిప్పలు పెట్టారు. దీంతో నిర్మాణ రంగం కుదేలైంది. ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. టీడీపీ ఇసుక కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేసింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు అందరూ నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పట్టించుకోవాలని ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ఇంతకాలానికి కొత్త ఇసుక విధానం నేటి నుండి అమల్లోకి రానుంది.
ఏపీలో కొత్త ఇసుక విధానం ..టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం
కొత్త ఇసుక విధానం ప్రకారం రీచుల వద్ద టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం ఇసుక రవాణా ఛార్జీల కింద 4 రూపాయల 90 పైసలుగా నిర్ణయించింది. ఇసుక రవాణాపై కూడా ప్రభుత్వం నూతన విధానం ఈరోజు నుండే అమలులోకి రానుంది. అతి తక్కువ కోట్ చేసిన ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం, ట్రాక్టర్లు లారీలు ఉన్న యజమానులు ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నట్లయితే వారికి ఇసుక రవాణాకు సంబంధించిన అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణం దెబ్బతినకుండా ఇసుక పంపిణీ జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఇసుక మాఫియాకి దోపిడీలకు తావులేకుండా ఇసుకను పారదర్శకంగా పంపిణీ చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయనుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అంతేకాదు అన్నిటికంటే కీలకంగా ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణాను నిషేధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్ల ఏర్పాటు .... అక్టోబర్ నెలాఖరుకు 70 నుంచి 80 శాతంకు స్టాక్ పాయింట్లు
ఇక 10కి.మీల లోపు ఇసుక రవాణాకు ట్రాక్టర్లను అనుమతించడం జరుగుతుందని అన్నారు. 13 జిల్లాల్లో 41 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అక్టోబర్ నెలాఖరుకు 70 నుంచి 80 శాతంకు స్టాక్ పాయింట్లు పెంచుతామని, దశల వారీగా స్టాక్ పాయింట్లు పెరుగుతాయని చెబుతున్నారు.
రైతుల పట్టా భూముల్లో ప్రభుత్వం ఇసుక తీసుకుని క్యూబిక్ మీటరుకు రూ.60లు చెల్లిస్తుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు . ఏపీఎండీసీ ద్వారా ఇసుక వ్యవస్థ నడుస్తుందని, పట్టా భూములు గల రైతులు ఇసుక అమ్మాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
రైతుల భూముల్లో క్యూబిక్ మీటర్ కు 60 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం
రైతులు భూమి నుండి ఇసుక కొనుగోలు చేయడానికి క్యూబిక్ మీటర్ కు 60 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇక ఆన్లైన్లో నమోదు చేసుకొని ఇసుకను వినియోగించుకోవచ్చన్నారు. నది గర్భం నుంచి యంత్రాల ద్వారా కాకుండా మనుషుల ద్వారా ఇసుకను తోడనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మొత్తం మీద ఇసుక రవాణా వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇంతకాలం ఇసుక కొరతతో ఇబ్బంది పడిన నిర్మాణరంగం ఇకనైనా కోలుకుంటుందా? కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అన్నది వేచి చూడాలి.