ఏపీ రాజకీయాల్లో కొత్త రుతువు..! ఆరంభమైన సవాళ్ల సీజన్..!!
గుంటూరు/హైదరాబాద్ : ఏపిలో అసలు సిసలైన రాజకీయాలకు తెర లెగవబోతోంది. వైసీపి ప్రభుత్వం కొలువు తీరిన తరుణంలో గత ప్రభుత్వాల తప్పిదాలను, అవినీతిని వెలికి తీస్తామని ప్రకటించిన నేపధ్యంలో మంత్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఏపి తొలి స్పీకర్ గా పని చేసిన కోడెల శివ ప్రసాద రావు అవినీతిపై కొరడా ఝుళిపించాలనుకుంటోంది వైసీపి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే కోడెల బాదితులు కూడా ఒక్కోక్కరు బయటకు వచ్చి కే టాక్స్ పేరుతో ఎంతెంత దోచుకున్నది బహిర్గతం చేస్తున్నారు. ఐతే ఇదంతా ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంగా కోడెల అభివర్ణిస్తున్నారు. ఆగ్రీ గోల్డ్ బాదితుల అంశంలో కూడా వైసీపి ప్రభుత్వం కావాలనే నిందలు మోపే ప్రయత్నం చేస్తోందిని, బాదితుల అంశంలో గత టీడిపి ప్రభత్వం తప్పు చేసిందని నిరూపిస్తే ప్రజా జీవితంనుండి తప్పుకుంటామని ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరుతున్నారు.
పథకం ప్రకారమే కేసులు..! నిరూపిస్తే ప్రజాజీవితానికి స్వస్తి అన్న శివ ప్రసాద్..!!
'నా కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే స్పష్టం చేశాను. కాని ఇప్పుడు నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తున్నారు. నా కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచిపద్ధతి కాదు. నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా. పథకం ప్రకారమే నా కుటుంబంపై కేసులు పెడుతున్నారు' అని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారు. శిలాఫలకాలు, స్వాగత ద్వారాలు ధ్వంసం చేస్తున్నారు. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవటం లేదు. పోలీసులు రక్షణ కల్పించకుండా 'కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లండి; అని సలహా ఇస్తున్నారు. అధికారాన్ని కక్షసాధింపు చర్యలకు వాడవద్దని సీఎం జగన్ను కోరుతున్నాని కోడెల తెలిపారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయి..! అధికారాన్ని కక్షసాధింపులకు వాడకూడదన్న కోడెల..!!
సభాపతిగా హైదరాబాద్లోని ఇంటికి మాత్రమే అద్దె తీసుకున్నా. ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామంటే సహకరిస్తాం. అక్రమాలు చేస్తే మాత్రం పోరాటం తప్పదు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోం' అని కోడెల హెచ్చరించారు. 'నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. విజయసాయిరెడ్డి లాంటి వారు ప్రవేశించటంతో రాజకీయాలు దిగజారిపోయాయి' అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతుంటే సీఎం జగన్కు పట్టదా?' అని పార్టీ జిల్లాఅధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
కోడెల కుమార్తెపై 3 కేసులు..! నిరూపించాలని సవాల్ విసురుతున్న మాజీ స్పీకర్..!!
మాజీ స్పీకర్ కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి, మరికొందరిపై కేసులునమోదయ్యాయి. కుల దూషణ, దాడి, బెదిరింపు తదితర ఆరోపణల కింద కేసులు నమోదు చేసినట్లు నరసరావుపేట రూరల్ సీఐ చినమల్లయ్య తెలిపారు. 'సత్తెనపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జల్ది ప్రసాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. వన్టౌన్ పీఎస్లో కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు ఒకకేసు, టూటౌన్ పీఎస్లో నకరికల్లు మం డలం చీమలమర్రికి చెందిన శేఖర్ ఫిర్యాదు మేరకే మరో కేసు... మొత్తం 3 కేసులు విజయలక్ష్మి, మరి కొందరిపై నమోదయ్యాయి' అని సీఐ తెలిపారు.
అగ్రిగోల్డ్ విషయంలో పిల్ వేసిందే నేను..! స్పందన లేకుంటే దావావేస్తానని కుటుంబరావు హెచ్చరిక..!!
అగ్రిగోల్డ్ కేసు విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే ప్రజాజీవితం నుంచి తప్పుకొంటానని టీడీపీ నేత, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు. అగ్రిగోల్డ్ సమస్యపై 2రోజులుగా తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 'అగ్రిగోల్డ్ బాధితులను రక్షించాలని, ఆర్థిక నిపుణుడు నర్సింహమూర్తి నేతృత్వంలో 2015లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నాతోపాటు నలుగురు సభ్యులను నియమించారు. అగ్రిగోల్డ్ విషయంపై నేనే హైకోర్టులో పిల్ దాఖలు చేశా. హాయ్లాండ్ ప్రాపర్టీని 600 కోట్ల రూపాయలతో వేలం వేస్తే అమ్ముడుపోలేదు. టీడీపీ నేతలు డబ్బులు తీసుకున్నారని అంటున్నారు? ఎవరు తీసుకున్నారు.. ఆధారాలు ఏంటి?. ఆధారాల్లేకుండా బురదజల్లి బద్నామ్ చేయాలనుకుంటున్నారా? నిజాయితీగల వ్యక్తి అధ్యక్షతన అగ్రిగోల్డ్ కమిటీని నియమించారు. ఆత్మహత్యలు చేసుకున్నవారి వద్ద కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు చూస్తుంటే... శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్లాగా తయారైందని అర్థమవుతోంది. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు ఇస్తానని, 72 గంటల్లో పంపిస్తానని చెప్పారు. వారి నుంచి స్పందన రాకుంటే సివిల్, క్రిమినల్ కేసులతోపాటు, పరువునష్టం దావా వేస్తానని కుటుంబరావు హెచ్చరించారు.