కిరణ్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేసిన రమేష్ కేసులో కొత్త కోణాలు
తనకు ప్రముఖులు తెలుసునని చెప్పి పరిచయం చేసుకున్న వారిని నిండా ముంచిన రమేష్ బాబు మోసాలలో మరో కొత్త కోణం. నాయకుల భార్యలకు, గన్మెన్లకు, పీఏలకు ఖరీదైన బహుమతులు ఇచ్చి పరిచయాలు పెంచుకునేవాడని తెలుస్తోంది.
అనంతపురం: తనకు ప్రముఖులు తెలుసునని చెప్పి పరిచయం చేసుకున్న వారిని నిండా ముంచిన రమేష్ బాబు మోసాలలో మరో కొత్త కోణం. నాయకుల భార్యలకు, గన్మెన్లకు, పీఏలకు ఖరీదైన బహుమతులు ఇచ్చి పరిచయాలు పెంచుకునేవాడని తెలుస్తోంది.
చదవండి: పవన్, జగన్ పేర్లు చెప్పి: యువతులపై అసభ్యకర కామెంట్లు పెట్టి..
రమేశ్ని అరెస్టు చేశారని తెలుసుకొని అతని బాధితులు చాలామంది అనంతపురం జిల్లాకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓ బాధితురాలు పోలీసులను కలిశారని తెలుస్తోంది.
కంపెనీలో పెట్టుబడులు పెట్టమని..
తన కంపెనీలో పెట్టుబడి పెట్టాలని తనను రమేశ్ అడిగాడని, మొదట తాను నమ్మలేదని, కొందరు నేతల పేర్లు చెప్పాడని, తనను వెంట బెట్టుకొని వారిలో కొందరి ఇళ్లకు తీసుకు వెళ్లాడని, అక్కడున్న సిబ్బంది, ఇళ్లలోని ఆడవారు.. రమేశ్ తమకు బాగా తెలుసన్నట్టు మాట్లాడటంతో నమ్మానని, ఆయనకు లక్షల మొత్తం ఇచ్చానని చెప్పినట్లుగా తెలుస్తోంది. డబ్బుల గురించి అడిగితే పలుమార్లు బెదిరించాడని చెప్పిందని సమాచారం.
సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వేధిస్తాడు
రమేష్ బోగస్ కంపెనీలు తెరిచి, ఇతరులను మోసం చేసి డబ్బులు తీసుకుంటాడు. ఎవరైనా ఎదురుతిరిగితే సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని వేధిస్తాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ధైర్యం చేసి రమేష్ బాబు పైన సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట.
బెదిరింపులు
దీంతో ఆ మహిళను రమేష్ వేధించాడని తెలుస్తోంది. ఇంకా మాట్లాడితే జనసేన నాయకుడినని కూడా బెదిరించాడని తెలుస్తోంది. రమేష్ బాబు అరెస్టు విషయం తెలుసుకొని సదరు మహిళ గురువారం అనంతపురం పోలీసులను కలిశారు.
రిమాండుకు తరలింపు
కాగా, మంగళవారం అదుపులోకి తీసుకొన్న రమేశ్బాబుని గురువారం పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. రమేశ్బాబుపై ఐపీసీ 419, 420, 320, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. కాగా, ఇతను గత ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.