రాజధాని వ్యవహారంలో కొత్త మలుపు: హైకోర్టుకు చేరిన సెలెక్ట్ వ్యవహారం..వాట్ నెక్ట్స్..?
విజయవాడ: ఏపీ మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. జనవరిలో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలో రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి ఛైర్మెన్ ఆదేశించారు. తన విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దీనిపైన రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఛైర్మెన్ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఏకంగా మండలినే రద్దు చేస్తూ ఏపీ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో మొత్తం వ్యవహారం పెండింగ్లో పడింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. మండలి ఛైర్మెన్ ఆదేశాలు అమలుకాలేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మరికాసేపట్లో విచారణ జరగనుంది.
బిల్లుల ఆమోదంతోనే రాజధాని తరలింపు- హైకోర్టుకు హామీ- జగన్ వ్యూహమిదేనా ?
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ 17న ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటన చేశారు. అప్పటి నుంచి అమరావతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ప్రభుత్వం ముందుకే కదలాలని నిర్ణయించింది. మూడు రాజధానులు సీఆర్డీఏ చట్టం రద్దు కోసం ప్రత్యేకంగా బిల్లులు తీసుకొచ్చింది. ఆ బిల్లులను కేబినెట్ సమావేశంలో ఆమోదించడం అదే రోజు జనవరి 20న ఏపీ శాసనసభలోనూ ప్రభుత్వం ఆమోదించింది. కానీ శాసనమండలిలో టీడీపీ మెజార్టీ కారణంగా అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. మూడు రోజుల చర్చ తర్వాత మెజార్టీ మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీకీ పంపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
అనేక వాయిదాలు తర్జనభర్జనల తర్వాత మండలి ఛైర్మెన్ షరీఫ్ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. దీనిని ప్రభుత్వం వ్యతిరేకించింది. టీడీపీ మాత్రం ఛైర్మెన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఛైర్మెన్ సభలో ప్రాతినిథ్యం ఉన్న పార్టీల్లో 8మందితో కమిటీ ఏర్పాటు చేయాలని మండలి కార్యదర్శిని ఆదేశించారు. కానీ కార్యదర్శి అందుకు ముందుకు రాలేదు. సెలెక్ట్ కమిటీ వేయడం సాధ్యపడదని సమాధానం ఇచ్చారు. దీంతో వ్యవహారం మొత్తం పెండింగ్లో పడింది
కొద్ది రోజుల క్రితం మండలి ఛైర్మెన్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ఛైర్మెన్ ఆదేశాలు అమలు కావడం లేదని అందులో ప్రస్తావించారు. మండలి కార్యదర్శికి క్విడ్ ప్రోకో కింద ప్రభుత్వం పదవి అప్పగించిందని ఆరోపించారు. ఈ కేసులో ప్రభుత్వంతో పాటుగా మండలి కార్యదర్శి ఉపకార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. గతంలో రాజధాని మార్పు, కార్యాలయ మార్పు విషయంలో తమకు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నిర్ణయాలు వెల్లడించరాదని స్పష్టం చేసిన హైకోర్టు ఇప్పుడు ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుందనేది ఉత్కంఠకు కారణమైంది.