ఏపీ ఈఎస్ఐ స్కాంలో కొత్త ట్విస్.. మాజీ మంత్రి పితానికి ఉచ్చు ? కొడుకు కోసం ముందస్తు బెయిల్ !!
ఈఎస్ఐ కుంభకోణంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విచారణ ఎదుర్కొంటున్న వేళ, తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.దీంతో ఈ కేసులో మాజీ మంత్రి పితాని మెడకు ఉచ్చు బిగుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏపీలో చట్టం ఎవరికీ చుట్టం కాదు..గుండ్రాయిలా ఉన్నా డ్రామాలేంటి అచ్చన్నా? : విజయసాయిరెడ్డి
ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పితాని
ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు మాత్రమే కాదు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర కూడా ఉన్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. 2017 లో కార్మిక శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడు ఈఎస్ఐ డైరెక్టర్లు గా ఉన్న రవి కుమార్ , రమేష్ లు ఇప్పుడు ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై గతంలో స్పందించిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజిలెన్స్ నివేదికలో తన పేరు లేదని పేర్కొన్నారు. తాను కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో డైరెక్టర్లు రవికుమార్ రమేష్ పై విచారణకు ఆదేశించానని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
పితాని కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్
కానీ తాజాగా ఈఎస్ఐ కుంభకోణం లో పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసుపై కొత్త ఆసక్తి నెలకొంది. అంతేకాదు పితాని దగ్గర అప్పట్లో పీఎస్ గా పనిచేసిన మురళీమోహన్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ అంశంపై కు హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ నేతలు వరుసగా పలు కేసులలో ఇరుక్కుంటున్న వేళ ముఖ్యంగా ఈఎస్ఐ మందుల కుంభకోణంలో పితానిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలకు వారు హైకోర్టును ఆశ్రయించటం ఊతమిచ్చింది .
ఈఎస్ఐ స్కామ్ విచారణలో ఏసీబీ దూకుడు
ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్లో 2014-15 నుంచి 2018-19 వరకు జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి ఈఎస్ఐ లో అవినీతి జరిగినట్లుగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ దర్యాప్తులో పలు కీలక ఆధారాలను సేకరించారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు .
పితాని మెడకు ఉచ్చు బిగుస్తోందా ?
దర్యాప్తులో భాగంగా 150కోట్ల వైద్య పరికరాల కొనుగోలు లో,988.77 కోట్ల మందుల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లుగా, అవినీతికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కేసులో నాటి ఈఎస్ఐ డైరెక్టర్ లతో పాటుగా టిడిపి హయాంలో నాడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుని సైతం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇక దీంతో ప్రస్తుతం పితాని సత్యనారాయణ కూడా అలర్ట్ అవ్వడం, ఈ కేసులో పితాని మెడకు కూడా ఉచ్చు బిగుస్తోందా అన్న డౌట్ వ్యక్తం అవుతుంది .