కొత్త మలుపు తిరిగిన రాజధాని అమరావతి వివాదం.. కాగ్ తో లింక్ పెట్టి హైకోర్టులో పిల్
రాజధాని అమరావతి వివాదం కొత్త మలుపు తిరిగింది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఒక లెక్క చెప్తుంటే రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత వైసీపీ ఇంకో లెక్క చెప్తుంది. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని కాగ్ అధ్యయనంతో లెక్క తేల్చాలని ఏపీ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.
కొనసాగుతున్న రాజధాని అమరావతి రగడ
రాజధాని అమరావతిపై రగడ కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న జగన్ మూడు రాజధానుల విషయంలో మండలి నో అన్నా , సెలెక్ట్ కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినా అవేవీ లెక్క చెయ్యకుండా శాసనమండలిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక కేంద్రం మండలి రద్దు తీర్మానాన్నిఆమోదించకున్నా , మూడు రాజధానుల ఏర్పాటు ఆమోదం పొందకున్నా సరే మూడు రాజధానులను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
రాజధాని అమరావతి విషయంలో హైకోర్టులో పలు పిటీషన్లు
ఇక ఇది ఇలా ఉంటే రాజధానిగా మారావాటిని కొనసాగించాలని , రాజధానిపై మొదట నుండి వేసిన కమిటీలను వ్యతిరేకిస్తూ, అలాగే సీఎం రాజధానిగా అమరావతి లేకుండా చెయ్యాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు రాజధాని గ్రామాల ప్రజలు . అంతే కాదు ఇప్పటి వరకు రాజధాని అమరావతి తరలింపు ఆపాలని పలు పిటీషన్లు దాఖలు చేశారు . రాజధాని అమరావతి నుండి ప్రభుత్వ భవనాల తరలింపును సైతం ఆపాలని కోర్టును కోరారు. ఇక ఈ పిటీషన్లపై విచారణ జరుగుతుంది.
రాజధానిగా అమరావతి ఉండాలా .. వద్దా .. కాగ్ తో తేల్చాలని పిల్
ఇక ఇదే క్రమంలో రాజధాని అమరావతిపై గత, ప్రస్తుత పాలకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు రాజధానిగా అమరావతిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై నిజానిజాలు తేల్చేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజధాని కోసం రూ.9 వేల కోట్లకు పైగా నిధులను వ్యయం చేశారని, 34 వేల ఎకరాల భూమిని సేకరించారని పిటిషన్లో పేర్కొన్నారు.
విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం
ఇంతా చేసిన తరువాత అమరావతిలో రాజధాని నెలకొల్పితే జరిగే వయబిలిటీ ఆధారంగానే అక్కడే క్యాపిటల్ కొనసాగించాలా ? లేక మరో చోటికి తరలించాలా అనే విషయంలో తేల్చాలన్నది తాజా పిటీషన్ సారాంశం. ఇక విజయవాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఎం. నారాయణా చార్యులు దాఖలు చేసిన పిల్పై శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
కేంద్ర, రాష్ట్ర సీఎస్ లకు , కాగ్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు
2014-19 మధ్యకాలంలో రాజధాని పేరిట జరిగిన అన్ని లావాదేవీలను ఆడిట్ చేయాలని కోరారు పిటిషనర్. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినయ్వనరే వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేంద్ర కేబినెట్, ఆర్థిక, హోంశాఖల కార్యదర్శులు, కాగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు దీనిపై తమ వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.దాంతో అమరావతి రాజధాని వివాదం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.